ఐఐటీ మద్రాస్ పరిశోధనతో చిలుక సరస్సులో డాల్ఫిన్లకు మేలు
ABN , First Publish Date - 2020-05-29T21:59:07+05:30 IST
ఒడిశాలోని చిలుక సరస్సులో ఇరవడి డాల్ఫిన్ల సంఖ్యను పెంచేందుకు
న్యూఢిల్లీ : ఒడిశాలోని చిలుక సరస్సులో ఇరవడి డాల్ఫిన్ల సంఖ్యను పెంచేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ పరిశోధకులు చేసిన కృషి దోహదపడుతోంది. సరస్సు పర్యావరణ వ్యవస్థపై ప్రభావాన్ని తగ్గించే డ్రెడ్జింగ్ విధానాన్ని అభివృద్ధి చేయడంతో డాల్ఫిన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
జియోటెక్నికల్, హైడ్రాలిక్, ఉపగ్రహ చిత్రాలను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అధ్యయనం చేశారు. సరస్సు పర్యావరణ వ్యవస్థపై ప్రభావాన్ని తగ్గించే డ్రెడ్జింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు.
ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆర్ సుందరవడివేలు మాట్లాడుతూ, చిలుక సరస్సు 4 వేల ఏళ్ళనాటిదన్నారు. ఇది పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాలలో విస్తరించిందన్నారు. సుసంపన్నమైన ఈ పర్యావరణ వ్యవస్థ, జీవజాలం మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోందన్నారు. మహానది నదికి మురుగు నీటి పారుదల వ్యవస్థగా కూడా వ్యవహరిస్తోందన్నారు. ఈ సరస్సును పునరుద్ధరించవలసిన అవసరం ఉందన్నారు.
తాము చేపట్టిన చర్యల వల్ల చిలుక సరస్సు పర్యావరణ, జీవావరణ వ్యవస్థ పునరుద్ధరణ అయిందని, జీవవైవిద్ధ్యం వృద్ధి చెందిందని తెలిపారు. చేపల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగిందన్నారు. తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ఇరవడి డాల్ఫిన్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు.
రూ.10 కోట్ల వ్యయంతో ఆరు నెలల కృషితో చిలుక సరస్సు మెరుగైన స్థితికి చేరిందని, ముప్పుగల సరస్సుల జాబితా నుంచి బయటపడిందని తెలిపారు.