ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుంటే పట్టాలు రదు
ABN , First Publish Date - 2022-08-11T06:44:06+05:30 IST
మండల కేంద్రమైన మునగపాక-1, నాగులాపల్లిలలోని జగనన్న ఇళ్ల కాలనీలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
లబ్ధిదారులకు ఈ విషయం తెలపండి
మునగపాక-1, నాగులాపల్లిలలో జగనన్న ఇళ్ల కాలనీ నిర్మాణాల తీరుపై జేసీ కల్పనాకుమారి అసంతృప్తి
మునగపాక, ఆగస్టు 10 : మండల కేంద్రమైన మునగపాక-1, నాగులాపల్లిలలోని జగనన్న ఇళ్ల కాలనీలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలనీకి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయం ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంపై అధికారులను తప్పుపట్టారు. తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలు రద్దు చేస్తామని లబ్ధిదారులను హెచ్చరించాలన్నారు. మునగపాకలో 133 ఇళ్ల కాలనీకి కేవలం 18 మాత్రమే ప్రారంభించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులాపల్లిలో రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసినప్పటికీ ఎందుకు నిర్మాణం చేపట్టలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది బదులిస్తూ ఇళ్ల కాలనీ నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపించడం లేదని తెలిపారు. సరఫరా చేసిన హౌసింగ్ మెటీరియల్ను చాలా మంది అమ్మేసుకుంటున్నారని చెప్పడంతో ఆమె మరింత మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలు దేనికని ప్రశ్నించారు. తక్షణమే హౌసింగ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలు రద్దుచేస్తామని చెప్పాలని ఆదేశించారు. మెటీరియల్ అందుకున్న వారి వివరాలను సేకరించి, వారికి నోటీసులు ఇవ్వాలని హౌసింగ్ సిబ్బందికి సూచించారు. ఈ నెలఖారులోగా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సిబ్బందిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం నాగులాపల్లిలో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణాన్ని జేసీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉదయశ్రీ, తహసీల్దార్ బాబ్జి, మండల ఇంజనీర్ చంద్రశేఖర్, జడ్పీటీసీ పెంటకోట సొంబాబు, సర్పంచ్ దిమ్మల అప్పారావు, హౌసింగ్ ఏఈ తనకేష్, ఈవోపీఆర్డీ ప్రసాద్, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.