ప్రయాణికుడి గొంతు కోసి చంపేసిన ‘కాందహార్’ హైజాకర్ కాల్చివేత

ABN , First Publish Date - 2022-03-10T00:29:22+05:30 IST

కఠ్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురిలో..

ప్రయాణికుడి గొంతు కోసి చంపేసిన ‘కాందహార్’ హైజాకర్ కాల్చివేత

న్యూఢిల్లీ: కఠ్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురిలో ఒకడైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో హతమయ్యాడు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇబ్రహీం.. ‘జహీద్ అఖుండ్’ పేరుతో చాలా ఏళ్లుగా చెలమాణి అవుతున్నాడు.


కరాచీలోని అక్తర్ కాలనీలో ఈ నెల 1న గుర్తు తెలియని సాయుధుడు ఇబ్రహీంను పాయింట్ బ్లాంక్‌లో రెండుసార్లు కాల్చి హతమార్చాడు.1999లో కఠ్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ-814 హైజాక్‌కు గురైంది. దీనిని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇబ్రహీం ఒకడు. అతడి కోడ్ నేమ్ ‘డాక్టర్’. 


ఆ విమానంలో 179 మంది ప్రయాణికులతో పాటు 11 మంది సిబ్బంది కూడా ఉన్నారు. కఠ్మాండ్‌ నుంచి బయలుదేరిన ఈ విమానాన్ని 4 డిసెంబరు 1999లో ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆప్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు విమానాన్ని తరలించడానికి ముందు విమానాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్‌లకు హైజాకర్లు తరలించారు.


అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల గుప్పిట్లో ఉంది. విమానంలో బందీలుగా ఉన్న ప్రయాణికుల్లో 25 ఏళ్ల భారతీయ యువకుడు రుపిన్ కత్యాల్‌ను ఇబ్రహీం కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఉగ్రవాదులతో జరిగిన చర్చల అనంతరం భారత ప్రభుత్వం కరుడుగట్టిన ఉగ్రవాదులు మసూద్ అజర్ అల్వి, సయ్యద్ ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్‌లను అదే ఏడాది ఏడాది డిసెంబరు 31న జైలు నుంచి విడిచిపెట్టి హైజాకర్ల చెర నుంచి ప్రయాణికులను విడిపించుకుంది.


ఈ హైజాకర్లలో ఒకడైన ఇబ్రహీం పేరు మార్చుకుని కరాచీలోని అక్తర్ కాలనీలో క్రీసెంట్ ఫర్నిచర్ పేరుతో కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇబ్రహీం అంత్యక్రియల్లో జేషే మహ్మద్ ఆపరేషనల్ చీఫ్ రవూఫ్, జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరుడు కూడా పాల్గొన్నాడు.

Updated Date - 2022-03-10T00:29:22+05:30 IST