120 మంది అధికారులతో గుజరాత్ చేరుకున్న ఐఏఎఫ్ విమానం
ABN , First Publish Date - 2021-08-17T18:10:56+05:30 IST
అప్ఘన్ రాజధాని కాబూల్ నుంచి 120 మంది భారత అధికారులతో బయలుదేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ సి-17 విమానం గుజరాత్లోని..
న్యూఢిల్లీ: అప్ఘన్ రాజధాని కాబూల్ నుంచి 120 మంది భారత అధికారులతో బయలుదేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ సి-17 విమానం గుజరాత్లోని జామ్నగర్ చేరుకుంది. అప్ఘనిస్థాన్లో నెలకొన్న తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ కాబూల్లోని మన దేశ రాయబారిని, సిబ్బందిని తక్షణం వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అందర్నీ సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు హుటాహుటిన చర్యలు తీసుకుంది. గత ఆదివారంనాడు అప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశాన్ని విడిచిపెట్టడంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఏఐ244 విమానం 129 ప్రయాణికులను తీసుకుని సోమవారం కాబూల్ నుంచి బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంది. అప్ఘాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు అక్కడి భయానక పరిస్థితి గురించి చెబుతున్నారు.