నా పోటీ ఎక్కడి నుంచో తెలీదు : యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2022-01-02T17:16:37+05:30 IST

త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ

నా పోటీ ఎక్కడి నుంచో తెలీదు : యోగి ఆదిత్యనాథ్

లక్నో : త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని, అయితే తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. శనివారం మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 


రానున్న శాసన సభ ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అయోధ్య, మధుర, లేదా, మీ సొంత జిల్లా గోరఖ్‌పూర్ నుంచా? అని మీడియా అడిగినపుడు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానన్నారు. 


ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో చేయలేకపోయిన పని ఏదైనా ఉందా? అని అడిగినపుడు యోగి స్పందిస్తూ, చెప్పినవాటినన్నిటినీ చేశామన్నారు. ఫలానా పని చేయలేకపోయాననే విచారం లేదన్నారు. కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ పోటీ చేసే అవకాశం రాదనే ఆందోళనను తొలగించడానికి ఆయన ప్రయత్నించారు. బీజేపీ చాలా పెద్ద కుటుంబమని తెలిపారు. సమయాన్నిబట్టి ఈ కుటుంబ సభ్యుల పాత్ర మారవచ్చునన్నారు. ప్రతి వ్యక్తి పాత్ర వేర్వేరు కాలాల్లో వేర్వేరు విధంగా ఉంటుందన్నారు. ఓ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభుత్వంలోనే ఉండాలనేమీ  లేదని, పార్టీ కోసం పని చేయవచ్చునని తెలిపారు. 


ఎన్నికల ప్రచారంలో కోవిడ్-19 మహమ్మారి నిరోధక మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తామని చెప్పారు. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడామని, ప్రస్తుతం తమ ప్రభుత్వ విజయాల ప్రాతిపదికపై పోటీ చేస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2022-01-02T17:16:37+05:30 IST