హైదరాబాద్‌లో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-01-26T13:33:19+05:30 IST

నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్‌లో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్యకు గురయ్యాడు. గత రాత్రీ బోరబండలోని ఆర్కే సొసైటీ సమీపంలో ఫిరోజ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫిరోజ్‌ను ఆస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సనత్‌నగర్‌ పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఫిరోజ్ కళ్లలో కారం కొట్టి దుండగులు కత్తులతో హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన దుండగుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 




గతంలో రౌడీ షీటర్ వాహిద్ హత్య  కేసులో  ఫిరోజ్ ఏ1గా ఉన్నాడు. వాహిద్ అనుచరులే ఫీరోజ్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిరోజ్‌పై భూ కబ్జా ఆరోపణలతో పాటు పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిరోజ్ హత్యకు పాత కక్షలు ఏమైనా కారణమా లేక మరేదైనా కారణం ఉందా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిరోజ్ మరణంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - 2021-01-26T13:33:19+05:30 IST