చెడువ్యసనాలకు బానిసై.. కన్నతల్లిని హత్యచేశాడు

ABN , First Publish Date - 2021-05-12T15:03:02+05:30 IST

చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి డబ్బుల కోసం కన్నతల్లిని గొంతునులిమి దారుణంగా...

చెడువ్యసనాలకు బానిసై.. కన్నతల్లిని హత్యచేశాడు

జీడిమెట్ల భగత్‌సింగ్‌నగర్‌లో ఘటన

పోలీసులు అదుపులో నిందితుడు 


హైదరాబాద్/జీడిమెట్ల: చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి డబ్బుల కోసం కన్నతల్లిని గొంతునులిమి దారుణంగా హత్యచేశాడు. ఈ అమానుష సంఘటన జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ముప్పిడి మల్లేష్‌, సువర్ణ(48)లు భార్యాభర్తలు. వీరి కుమారుడు హరిబాబు(25). మల్లేష్‌ సనత్‌నగర్‌లో టైలర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. సువర్ణ కూడా ఇంట్లో టైలరింగ్‌ చేస్తుంది. హరిబాబు(25) ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొంతకాలంగా చెడువ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఈ నెల 10న ఉదయం 8గంటలకు తన తండ్రిని బాలానగర్‌ చౌరస్తాలో బైక్‌పై వదిలిపెట్టాడు. తిరిగి ఇంటికి వచ్చాక తల్లిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో హరిబాబు బెడ్‌రూమ్‌లో తల్లి మెడకు టవల్‌ చుట్టి గట్టిగా అదిమిపట్టడంతో ఆమె మృతి చెందినట్టు పోలీసులు బావిస్తున్నారు. ఆ తర్వాత హరిబాబు ఇంట్లోని దాదాపు 10తులాల బంగారు నగలు, రూ.50వేల నగదు తీసుకుని పారిపోయాడు. విధులు ముగించుకుని రాత్రి 8గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన మల్లేష్‌ బయట తలుపులు వేసి ఉండటంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లగా సువర్ణ కుమారుడి బెడ్‌రూమ్‌లో దారుణంగా హత్యకు గురై ఉంది. బీరువా పగలగొట్టి బీరువాలోని నగలు నగదు దొంగిలించినట్టుగా ఉంది. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తల్లిని దారుణంగా హత్య చేసిన కుమారుడు హరిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-12T15:03:02+05:30 IST