పెళ్లొద్దు.. చదువుకుంటా..
ABN , First Publish Date - 2022-08-11T06:16:47+05:30 IST
‘నాకు పెళ్లి వద్దు... చదువుకుంటా’ అని ఓ యువతి బుధవారం మానవ
హెచ్ఆర్సీని ఆశ్రయించిన యువతి
మంగళ్హాట్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ‘నాకు పెళ్లి వద్దు... చదువుకుంటా’ అని ఓ యువతి బుధవారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. జగద్గిరిగుట్ట పోలీ్సస్టేషన్ పరిధిలోని గాజులరామారానికి చెందిన 19 సంవత్సరాల యువతి డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు జూలై 31న కుటుంబ సభ్యులు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. ఈ నెల 20న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, చదువుకుంటానని కుటుంబసభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలియకుండా హెచ్ఆర్సీని అశ్రయించింది. అప్పటికే కార్యాలయం సమయం ముగియడంతో గురువారం ఉదయం 11 గంటలకు రావాలని అధికారులు ఆమెకు సూచించారు. ఇదిలా ఉండగా యువతి తల్లిదండ్రులు హెచ్ఆర్సీ కార్యాలయం వద్దకు చేరుకుని అమ్మాయితో మాట్లాడేందుకు యత్నించగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్పందించిన హెచ్ఆర్సీ సిబ్బంది, యువతిని తల్లిదండ్రులను సముదాయించి పంపిం చే ప్రయత్నం చేయగా, ఆ యువతి తనకు రక్షణ కల్పించాలని కోరింది. స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించితే వారు రక్షణ కల్పిస్తారని అక్కడి సిబ్బంది సూచించారు.