ఆహారం రోజుకు ఎన్నిసార్లు తింటే మంచిది..
ABN , First Publish Date - 2020-04-27T16:44:18+05:30 IST
తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు ఒకప్పుడు చెప్పేవారు. ఇప్పుడేమో పన్నెండు గంటలకొకసారి మాత్రమే తింటే మంచిదంటున్నారు. ఏది పాటించాలి?
ఆంధ్రజ్యోతి(27-04-2020)
ప్రశ్న: తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు ఒకప్పుడు చెప్పేవారు. ఇప్పుడేమో పన్నెండు గంటలకొకసారి మాత్రమే తింటే మంచిదంటున్నారు. ఏది పాటించాలి?
-అపర్ణ, విజయవాడ
డాక్టర్ సమాధానం: మనం తీసుకునే ఆహారం శక్తిని, పోషకాలను ఇవ్వడమే కాకుండా రక్తంలో గ్లూకోజు పరిమాణం సరిగా ఉండడానికీ ఉపయోగపడుతుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులైనవారు ఎక్కువసార్లు తక్కువగా లేదా పన్నెండు గంటలకోసారి మాత్రమే తగిన ఆహారం తీసుకున్నా వారి శరీరం గ్లూకోజును సక్రమంగా నియంత్రిస్తుంది. కాబట్టి హైపర్ గ్లైసీమియా లేదా హైపో గ్లైసీమియా లాంటివి రావు. కానీ మధుమేహం, గుండె సమస్యలు, క్లోమం, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సమస్యలు మొదలైనవి ఉన్నవారు వీలున్నంత వరకు రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు పరిమిత మోతాదులో ఆహారం తీసుకోవడమే శ్రేయస్కరం. ముఖ్యంగా మధుమేహ చికిత్స కోసం ఇన్సులిన్ తీసుకుంటున్న వారు ప్రతి రెండు మూడు గంటలకోసారి కొంత ఆహారం తీసుకోవాలి.
అయితే ఆరోగ్యవంతులు కుడా తీసుకుంటే నష్టమేం ఉండదు. రోజు మొత్తంలో పలు మార్లు ఆహారం తీసుకున్నా లేదా రెండు మూడుసార్లు తీసుకున్నా, ఆ ఆహారం సమతులమైనది అయినప్పుడే ఆరోగ్యవంతమైనది అవుతుంది. జీవక్రియ వేగం ఎక్కువగా ఉండే వారు, పిల్లలు మాత్రం రోజుకు మూడు పూటలే కాకుండా మధ్యలో అల్పాహారం తీసుకుంటే తరచూ ఆకలి వేయకుండా ఉంటుంది, శ్రమ, ఆటల వల్ల అలసట, నీరసం తగ్గించవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)