జగనన్న ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్న ట్రాక్టర్ యజమానులు
ABN , First Publish Date - 2022-05-17T03:51:59+05:30 IST
మండలంలోని దామవరం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలను సోమవారం ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు.
పనులు అడ్డుకుంటే కేసులు పెడుతాం : డీఈ
దగదర్తి, మే 16: మండలంలోని దామవరం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలను సోమవారం ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ దళితవాడ, బీసీ కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల లేఅవుట్లకు తోలిన మట్టికి సంబంధించి రూ.40 లక్షల వరకు బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి కాంట్రాక్టర్ను డబ్బులు అడుగుతుంటే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి మరీ ఆయిల్ తెచ్చామని, ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టాలని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల వాళ్లు ఇళ్లచుట్టూ తిరుగుతున్నారని నిలదీశారు. దీంతో సమాచారం అందుకున్న హౌసింగ్ డీఈ రంగవరపు ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. లేఅవుట్ లెవలింగ్కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ కింద నగదు విడుదల కావాలన్నారు. అది విడుదల కాకపోవడంతో ప్రభుత్వమే బిల్లులు చెల్లించేందుకు చూస్తోందని, ఇందుకు నెల రోజుల సమయం పడుతుందన్నారు. అయినా ట్రాక్టర్ యజమానులు వినకుండా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పనులను అడ్డుకుంటే కేసులు పెడతామని డీఈ హెచ్చరించనప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.