నత్తనడకన శ్మశాన వాటికల నిర్మాణం
ABN , First Publish Date - 2021-03-05T05:28:52+05:30 IST
పట్టణాల్లో మృత దేహాలను దహనం చేయడానికి అవసరమైన యంత్రాలు, నూతన భవనాల ఏర్పాటుకు సంబంధించిన పనులు నత్తనడకన పట్టాయి.
ఏడాది కిందట ఐదు పట్టణాలకు
ఆర్థిక సంఘం నిధులు
భీమవరం, మార్చి 4 : పట్టణాల్లో మృత దేహాలను దహనం చేయడానికి అవసరమైన యంత్రాలు, నూతన భవనాల ఏర్పాటుకు సంబంధించిన పనులు నత్తనడకన పట్టాయి. జిల్లాలో లక్ష జనాభా దాటిన పట్టణాలలో వీటి ఏర్పాటు కోసం హిందూ శ్మశాన వాటికలకు 14వ ఆర్థిక సంఘం నిధులు గతేఏడాది కేటాయించారు. ఏలూరు నగరానికి రూ.1.52 కోట్లు, భీమవరానికి రూ.1.34 కోట్లు, తాడేపల్లిగూడెంకు రూ.1.22 కోట్లు, అలాగే నరసాపురం, తణుకు పట్టణాలకు కూడా కోటి రూపాయలు వంతున కేటాయించారు. భవనాలు నిర్మించడంతో పాటు అందులో ఎలక్ట్రిక్ దహన యంత్రానికి రూ.39 లక్షలు వ్యయం చేసేలా ఈ పనులు సాగుతున్నాయి. శ్మశానవాటిక ప్రాంతాల్లో పచ్చని వాతావరణం ఏర్పాటు చేయడం, దహన సమయంలో బంధువులు ఉండేందుకు సౌకర్యాలు, అనంతరం స్నానం ఆచరించడానికి వసతి, కర్మకాండలు ఏర్పాటుకు వంటి వసతులు కల్పించేలా ఈ పనులు సాగుతున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా ఈ పనులు చాలా కాలం నిలిచిపోయాయి. ఇటీవల మళ్ళీ పనులు ప్రారంభమైనా అవి ఊపందుకోలేదు. భీమవరంలో పనులు కొంత వేగంగా సాగుతున్నాయి. కరోనాకి తోడుగా భారీవర్షాలు కారణంగా కూడా ఈ పనులు నిలిచిపోయాయి. పట్టణాలలో శ్మశానాలు వసతుల సమస్య చాలా కాలంగా పరిష్కారం కావడం లేదు. ఈ ప్యాకేజీ వలన హిందూ శ్మశాన వాటికలు ఆహ్లాదకరంగా తయారవడంలో సందేహం లేదు.