ఆమె మరణం

ABN , First Publish Date - 2021-10-28T05:12:43+05:30 IST

సంచార జీవనం గడిపే వారి ఇంట విషాదకర ఘటన చోటు చేసుకుంది. పేదరికం శాపంగా మారి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

ఆమె మరణం
హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకువెళ్తున్న ద్రోణాచల సేవా సమితి సభ్యులు

రైల్వే ప్లాట్‌ఫారంపై గర్భిణి మృతి

అంత్యక్రియలకు డబ్బుల్లేక.. రాత్రంతా..  


డోన(రూరల్‌), అక్టోబరు 27: సంచార జీవనం గడిపే వారి ఇంట విషాదకర ఘటన చోటు చేసుకుంది. పేదరికం శాపంగా మారి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. డోన పట్టణంలో చోటు చేసుకున్న ఓ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. డోన రైల్వేస్టేషన ప్లాట్‌ ఫారం మీద మంగళవారం రాత్రి నిరుపేద గర్భిణి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు డబ్బులు లేక రాత్రంతా ప్లాట్‌ఫారం మీద మృతదేహం పక్కనే గడిపారు భర్త, పిల్లలు. అనంతపురానికి చెందిన గోపాల్‌ తన భార్య ఫక్కీరమ్మ, కొడుకు బాలు, కూతురు శాంతితో కలిసి ఊరూరా తిరుగుతూ దేవతలు, సినీతారల స్టిక్కర్లు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం డోనకు చేరుకున్న ఆ కుటుంబం రైల్వేస్టేషన ప్లాట్‌ఫారంపై ఉంటోంది. ఫక్కీరమ్మ ఐదు నెలల గర్భిణి. అనారోగ్యంతో బాధపడుతున్నా, వైద్యం కోసం డబ్బులు లేక గోపాల్‌ ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు. ఏం చేయాలో తోచక రాత్రంతా భర్త, పిల్లలు మృతదేహంతోనే గడిపారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న డోన రైల్వేస్టేషన మాస్టరు ద్రోణాచలం సేవాసమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు స్పందించి రైల్వేస్టేషనకు చేరుకున్నారు. రైల్వే పోలీసుల సహకారంతో గర్భిణి మృతదేహానికి పట్టణ సమీపంలోని శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ద్రోణాచలం సేవా సమితి సభ్యులు షాదీఖానా రాజు, షేర్షా, గురుస్వామి, పానీపూరి మురళి, రసూల్‌, చాంద్‌బాషా, రైల్వే పోలీసులు శివప్రసాద్‌, రామనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



Updated Date - 2021-10-28T05:12:43+05:30 IST