Heavy rains: దక్షిణాది జిల్లాల్లో కుండపోత వర్షం
ABN , First Publish Date - 2022-08-03T13:55:39+05:30 IST
కేరళలో రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. కన్నియాకుమారి, కోయంబత్తూరు, తిరుచ్చి తదితర
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 2: కేరళలో రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. కన్నియాకుమారి, కోయంబత్తూరు, తిరుచ్చి తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా, పలు ప్రాంతాలను కుండపోత ముంచెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. కన్నియాకుమారి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోయంబత్తూరులో భారీ వర్షాలకు సింగానల్లూరు బస్టాండు(bus stand) జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈరోడ్డు జిల్లాలో వర్షాలకు భవానీ సాగర్ డ్యాం పూర్తిస్థాయికి చేరింది. డ్యాం భద్రత దృష్ట్యా కాలువల్లో నీటిని విడుదలచేస్తున్నారు. ఇందువల్ల తీరప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు ఆడి పెరుక్కు కోసం బుధవారం నదులు, కాలువలకు స్నానాలకు వెళ్లొద్దని అధికారులు లౌడ్ స్పీకర్ల(Loudspeakers) ద్వారా హెచ్చరిస్తున్నారు. అలాగే సేలం జిల్లాలోని పుష్కరఘాట్ల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కారుమేఘం తెలిపారు. తిరునల్వేలి జిల్లా తెన్కాశి వద్ద ప్రసిద్ధి చెందిన కుట్రాలంలోని ఐదు జలపాతాలు(Waterfalls) ఉధృతం రూపం దాల్చాయి. మూడు రోజులుగా ఆ జలపాతాల వద్ద స్నానాలకు అనుమతించకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నేడు నీలగిరి జిల్లాలో సెలవు
భారీ వర్షాల కారణంగా పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లాకు బుధవారం సెలవు ప్రకటించారు. పర్యాటక ప్రాంతాలను పూర్తిగా మూసివేయడంతో పాటు విద్యాలయాలకు సెలవు ఇవ్వనున్నట్లు నీలగిరి జిల్లా కలెక్టర్ అమృత్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా వుండగా తిరుప్పూర్, దిండుగల్, తేని తదితర జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలకు ఎన్డీఆర్ఎ్ఫ దళాలలను తరలించారు.