భారీ వర్షం.. అంతా జలమయం

ABN , First Publish Date - 2021-10-23T06:15:26+05:30 IST

నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అనకాపల్లి, కశింకోట పట్టణం, మండలాల్లో కుండపోత వాన పడింది.

భారీ వర్షం.. అంతా జలమయం
కశింకోట జాతీయ రహదారిపై కురుస్తున్న వర్షం

అనకాపల్లి, కశింకోటలో కుండపోత

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

ప్రయాణికులు, వాహన చోదకుల పాట్లు


అనకాపల్లి టౌన్‌/కశింకోట, అక్టోబరు 22: నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అనకాపల్లి, కశింకోట పట్టణం, మండలాల్లో కుండపోత వాన పడింది. పాఠశాలలు విడిచి పెట్టే సమయంలో సుమారు గంట పాటు కురిసన వర్షానికి విద్యార్థులు ముద్దయ్యారు. అలాగే లోతట్టు  ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి, పూడిమడక రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ, కూరగాయల మార్కెట్‌, పరమేశ్వరి పార్కు కూడళ్లల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి వద్ద నీటితో ఇరువైపులా సబ్‌ వేల్లో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనచోదకులు అండర్‌బ్రిడ్జి దాటడానికి అవస్థలు పడ్డారు. అలాగే రహదారుల్లో చిల్లర వర్తకులు నరకం చూశారు. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు.

కశింకోట మండల క్రేందంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండతీవ్రంగా కాసింది. మూడున్నర గంటల సమయంలో ఆకాశం మేఘామృతమై ఒక్కసారిగా కుండపోతగా వాన పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం వరిపంటకు మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-10-23T06:15:26+05:30 IST