వైద్యం వికటించి ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-01-25T05:54:53+05:30 IST
వరదయ్యపాళెం మండలం కోవూరు పాడుకలో ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు.
సత్యవేడు, జనవరి 24: వరదయ్యపాళెం మండలం కోవూరు పాడుకలో ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల మేరకు.... కోవూరు పాడుకు చెందిన మునిబాబు(32) ఈ నెల 22వ తేదీ ఒళ్లు నొప్పులు ఉండడంతో చికిత్స కోసం చిన్నపాండూరులోని రవినాయుడు అనే ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఆ వైద్యుడు ఏదో ఇంజక్షన్ వేయగా ఆ రోజు రాత్రే మునిబాబుకు కాళ్లు బాగా వాచాయని, మళ్లీ ఆదివారం ఉదయం వరదయ్యపాలెంలోని డాక్టర్ వద్దకు వెళ్ళగా కాలంచెల్లిన మందులు వాడితే ఇలా జరుగుతుందని తెలిపినట్లు చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి విషమంగా ఉండడంతో మునిబాబును సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. మునిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలం చెల్లిన మందులు వాడుతున్న ఆర్ఎంపీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.