సాగుచట్టాల రద్దు కోసం పోరాడిన రైతులకు వందనం
ABN , First Publish Date - 2021-11-27T04:09:43+05:30 IST
సాగుచట్టాల రద్దు కోసం ఏడాదిగా పోరాడుతున్న రైతులు ఎట్టకేలకు గొప్ప విజయం సాధించారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అభినందించారు. పటాన్చెరు పారిశ్రామికవాడలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు ఉద్యమం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయ్దివస్ నిర్వహించారు.
ప్రతికూల పరిస్థితుల్లో చేసిన పోరాటం అమోఘం
కనీస మద్దతు ధరపై చట్టం చేయాలి
విద్యుత్ సవరణల బిల్లును ఉపసంహరించాలి
రైతు పోరాట స్ఫూర్తితో కార్మిక పోరాటాలు
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు
పటాన్చెరు రూరల్, నవంబరు 26 : సాగుచట్టాల రద్దు కోసం ఏడాదిగా పోరాడుతున్న రైతులు ఎట్టకేలకు గొప్ప విజయం సాధించారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అభినందించారు. పటాన్చెరు పారిశ్రామికవాడలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు ఉద్యమం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయ్దివస్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని, చలిని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు వీరోచితంగా పోరాటం చేశారని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పోరాటాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదుల పేరిట తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేసిందని, అయినా రైతులు మొక్కవోని దీక్షతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదేబాటలో కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, విద్యుత్ సవరణల బిల్లును ఉపసంహరించుకోవాలని, అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.