అదృశ్యమైన వ్యక్తి కేసులో వీడిన మిస్టరీ.. వివాహేతర బంధం గురించి తెలిసి..

ABN , First Publish Date - 2020-08-12T13:04:50+05:30 IST

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ..

అదృశ్యమైన వ్యక్తి కేసులో వీడిన మిస్టరీ.. వివాహేతర బంధం గురించి తెలిసి..

పరవాడ(విశాఖపట్నం): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయగా సదరు వ్యక్తి వివాహేతర సంబంధం కారణంగా హత్యకు గురైనట్టు నిర్థారణ అయ్యింది. పరవాడ సీఐ ఉదయ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలావున్నాయి.. హస్తినాపురం గ్రామానికి చెందిన మిడతాన ధర్మరాజు(40) ఈ నెల రెండో తేదీన సాయంత్రం మూడు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో భార్య సత్యవేణి మూడున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఆరవ తేదీన  బండారుపాలెం శశ్మానవాటిక సమీపంలో కుళ్లిపోయి ఉన్న స్థితిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


అలాగే మృతదేహానికి అర కిలోమీటరు దూరంలో ద్విచక్ర వాహనం ఉన్న విషయాన్ని గుర్తించారు.  సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హతుడు ధర్మరాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మద్యానికి బానిసైన ధర్మరాజు ప్రతిరోజూ దిబ్బపాలెంలో నాటుసారా విక్రయిస్తున్న మైలపల్లి దేముడమ్మ ఇంటికి వెళ్లేవాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. విషయం దేముడమ్మ భర్త కుళ్లయ్యకు తెలిసి  ఇద్దరినీ మందలించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల రెండున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బండారుపాలెం జీడిమామిడి తోటల్లో వీరిరువురూ కలిశారు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన కుళ్లయ్య పట్టరాని కోపంతో ధర్మరాజు గొంతును గట్టిగా పట్టుకోవడంతో భయపడిన దేముడమ్మ అక్కడ నుంచి పారిపోయింది. అప్పటికే తన వెంట తీసుకెళ్లిన సెల్‌ఫోన్‌ చార్జర్‌ వైరుతో ధర్మరాజు మెడను కుళ్లయ్య గట్టిగా బిగించి అంతమెందించాడు. నిందితుడుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2020-08-12T13:04:50+05:30 IST