ఎలాంటి విచారణకైనా సిద్ధం: హిమంత్ బిస్వా శర్మ
ABN , First Publish Date - 2021-07-31T20:09:19+05:30 IST
అసోం-మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలపై ఎలాంటి విచారణకైనా తాను సహకరిస్తానని..
ఐజ్వాల్: అసోం-మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలపై ఎలాంటి విచారణకైనా తాను సహకరిస్తానని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అన్నారు. అయితే, తాను మిజోరాం సీఎంను ఒక ప్రశ్న వేయదలచుకున్నానని చెప్పారు. ఈ కేసును తటస్థ ఏజెన్సీకి ఆయన ఎందుకు అప్పగించలేదో చెప్పాలని మిజోరాం సీఎం జోరమ్ తంగాను శర్మ శనివారంనాడు ఒక ట్వీట్లో ప్రశ్నించారు. అదీగాక ఘటన జరిగిన ప్రాంతం రాజ్యాంగబద్ధమైన అసోం భూభాగంలో జరిగందని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జోరమ్ తంగాకు చెప్పానని పేర్కొన్నారు.
మిజోరం కోలాసిబ్ జిల్లాలోని వైరెంగ్టె టౌన్ శివార్లలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో శర్మతో సహా నలుగురు రాష్ట్ర పోలీసు అధికారులు, మరో ఇద్దరు అధికారులపై కేసు నమోదైంది. హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద ఈ కేసులు నమోదు చేసినట్టు మిజోరం ఐజీపీ (హెడ్ క్వార్టర్స్) తెలిపారు. సరిహద్దు టౌన్లో మిజోరాం, అసోం పోలీసు బలగాల మధ్య తుపాకీ కాల్పులతో ఘర్షణ జరిగిన అనంతరం వైరంగ్టే పోలీసు స్టేషన్లో సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఆయన చెప్పారు. అలాగే 200 మంది గుర్తుతెలియని అసోం పోలీసు సిబ్బందిపై కూడా కేసు నమోదైనట్టు ఆయన వివరించారు. నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఆగస్టు 1న ప్రశ్నించేందుకు సమన్లు పంపినట్టు ఆయన చెప్పారు.