జిల్లాలో వడగండ్ల వాన

ABN , First Publish Date - 2021-05-03T05:04:50+05:30 IST

జిల్లాలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల మామిడి నేలరాలింది. చేతికచ్చిన పంట ధ్వంసమైంది.

జిల్లాలో వడగండ్ల వాన
తాంసి మండలంలో నేలకొరిగిన జొన్న పంట

సాకెరలో పిడుగుపాటుకు 25 మేకలు మృతి 

బోథ్‌ రూరల్‌, మే 2: జిల్లాలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల మామిడి నేలరాలింది. చేతికచ్చిన పంట ధ్వంసమైంది. తాంసి మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో యాసంగి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నువ్వుల పంట పూర్తిగా నేల పాలైంది. మరో రెండు మూడు రోజుల్లో కోతకు వచ్చే పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బోథ్‌ మండలం సాకెర గ్రామానికి చెందిన 25 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. ఆదివారం సాకేర గ్రామానికి చెందిన పలువురి మేకలను బుర్కే గోవింద్‌ అనే మేకల కాపరి గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో మేకలన్నీ సమీపంలోని చెట్టు కిందికి వెళ్లగా ఇదే సమయంలో ఒక్కసారిగా మేకలపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. మేకల కాపరి సురక్షితంగా ఉన్నాడు.

Updated Date - 2021-05-03T05:04:50+05:30 IST