అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రమాణం చేస్తున్న జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు
విశాఖపట్నం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ గురువారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించింది. ఈమేరకు జేఏసీ ప్రతినిధులు రామనారాయణ, అప్పలరాజుల ఆధ్వర్యంలో ఉద్యోగులంతా జీవీఎంసీ నుంచి ర్యాలీగా వెళ్లి ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించడం దారుణమని, తక్షణం దీనిలోని లోపాలను సవరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు గురువారం నుంచి నిరాహార దీక్షలు ప్రారంభించి, వచ్చేనెల ఆరు అర్ధరాత్రి నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.