గుంటూరు మిర్చియార్డుకు మళ్లీ సెలవులు
ABN , First Publish Date - 2020-07-13T14:01:11+05:30 IST
గుంటూరు నగరంలో కరోనా వైరస్ విస్త్రృతంగా వ్యాప్తి చెందుతుండటంతో..
20వ తేదీన పునఃప్రారంభం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో కరోనా వైరస్ విస్త్రృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ముందుజాగ్రత్తగా మిర్చియార్డుని మూసేయాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీ సోమవారం నుంచి 19వ తేదీ వరకు మూసేయాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు యార్డు మూసివేత ఉత్తర్వులను చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం జారీ చేశారు. 20వ తేదీన తిరిగి లావాదేవీలు ప్రారంభమవుతాయని, అప్పటివరకు యార్డుకు రైతులు, హమాలీలు, కమీషన్, ఎగుమతి వ్యాపారస్థులు, సిబ్బంది రావొద్దని సూచించారు. ఈ పది రోజుల పాటు యార్డులో క్రిమిసంహార ప్రక్రియని పెద్దఎత్తున చేపడతామన్నారు.
కరోనా లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మిర్చియార్డుకు ఇప్పటికే పలుదఫాలు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. అన్లాక్లోనూ వైరస్ ఉద్ధృతి కారణంగా మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో అటు రైతులు, ఇటు హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్టు ఆర్డర్స్ ఇక్కడి వ్యాపారస్థులకు వస్తున్నాయి. ఇప్పటికే పార్శిల్ రైలు ద్వారా 500 టన్నుల వరకు ఎగుమతి కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ వారం పాటు మూసేయడం వలన ముఖ్యంగా హమాలీలకు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇదిలావుంటే రైతులకు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ పనులకు చేతిలో డబ్బులు మెండుగా అవసరం అవుతాయి. ఈ పరిస్థితుల్లో శీతలగిడ్డంగుల్లో నిల్వ ఉన్న మిర్చి టిక్కీలను విక్రయించుకోవాలంటే ఇలా సమస్యలు వస్తుండటంతో వారు ఏమి చేయాలో పాలుపోవడం లేదని చెబుతున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే బ్యాంకులు కొత్తవి ఇస్తాయి. అందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ నేపథ్యంలో కరోనా లాక్డౌన్ విపత్తుని ప్రత్యేకంగా పరిగణించి పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని మిర్చి రైతులు కోరుతున్నారు.