గృహలక్ష్మి స్కీం... ఈ మహిళలకు నెలకు రూ.5000 ఇస్తాం

ABN , First Publish Date - 2021-12-11T23:15:39+05:30 IST

రానున్న గోవా శాసన సభ ఎన్నికల్లో మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు

గృహలక్ష్మి స్కీం... ఈ మహిళలకు నెలకు రూ.5000 ఇస్తాం

పనజి : రానున్న గోవా శాసన సభ ఎన్నికల్లో మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు టీఎంసీ, కాంగ్రెస్ భారీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు, ప్రతి నెలా నగదు బదిలీలు వంటి తాయిలాలను ఆశ చూపుతున్నాయి. టీఎంసీ శనివారం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే, కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా కుటుంబ పెద్దగా వ్యవహరించే ప్రతి మహిళకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కుల, మతాలు, ఆర్థిక స్థోమత వంటివాటితో సంబంధం లేదని, రేషన్ కార్డులో కుటుంబ పెద్దగా పేరు ఉన్న ప్రతి మహిళ ఈ పథకం వల్ల లబ్ధి పొందవచ్చునని తెలిపింది. 


టీఎంసీ ఎంపీ, గోవా రాష్ట్ర శాఖ ఇన్‌ఛార్జి మహువా మొయిత్ర ఈ పథకాన్ని ప్రకటించారు. డోనా పౌలాలోని ఇంటర్నేషనల్ సెంటర్‌లో గృహ లక్ష్మి కార్డును ఆవిష్కరించిన అనంతరం మొయిత్ర మాట్లాడుతూ, ఇది రాష్ట్రంలోని మహిళలందరికీ వర్తిస్తుందని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండటం, కుల, మతాలు, కుటుంబ ఆదాయం వంటివాటితో సంబందం లేదని, రేషన్ కార్డులో కుటుంబ పెద్దగా పేరు ఉన్న మహిళలు లబ్ధి పొందవచ్చునని తెలిపారు. ఈ పథకం క్రింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5,000 చొప్పున నగదు అందజేస్తామని చెప్పారు. ఈ పథకం గురించి ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ పథకం విజయవంతమైందన్నారు. ఇది మంచి మార్పు కోసం ఉపయోగపడుతుందని చెప్పారు. గోవా ప్రజల మంచితనం ఆధారంగా తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం దక్షిణ గోవాలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని  చెప్పారు. స్వయం సహాయక బృందాలకు రూ.1 లక్ష వరకు రుణం ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


గోవా శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతాయి. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం ఈ రాష్ట్రంలో 11.47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.87 లక్షల మంది మహిళలు.


Updated Date - 2021-12-11T23:15:39+05:30 IST