వైద్యకళాశాల భూసేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-09-25T17:27:35+05:30 IST

ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు..

వైద్యకళాశాల భూసేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

సమనస, చిందాడగరువు గ్రామాల రైతులు ఓకే..

ఎకరాకు రూ.74.5 లక్షలు చెల్లించేందుకు అంగీకారం


అమలాపురం (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు వచ్చారు. దాంతో అమలాపురంలో ఏర్పాటయ్యే ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. గతంలో అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు గ్రామంలో జాతీయ రహదారిని ఆనుకుని 50 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. అయితే కోట్ల రూపాయల విలువైన ఆ భూములను తాము వైద్యకళాశాల కోసం ఇచ్చేందుకు సిద్ధంగా లేమని, బలవంతపు భూసేకరణకు దిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ రైతులు ఎదురుతిరిగారు.


దాంతో అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ వైద్యకళాశాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ మురఽళీధర్‌రెడ్డితో కలిసి కామనగరువులోని బడుగువారిపేటలో భూములను పరిశీలించినప్పటికీ అక్కడ నివేశన స్థలాలు, భూములు కోల్పోతామని బాధితులు ఆందోళనకు దిగడంతో మళ్లీ మూడో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్‌ మండలం సమనస శివారు రంగాపురం-చిందాడగరువు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న భూములపై దృష్టి పెట్టిన మంత్రి విశ్వరూప్‌ ఆ రైతులతో దఫదఫాలుగా చర్చలు జరిపి గురువారం ఫైనల్‌ చేశారు. 216 జాతీయ రహదారికి కిలోమీటరులోపు దూరంలో ఉన్న ఈ భూములు కళాశాల నిర్మాణానికి అనువైన ప్రాంతంగా నిర్ణయించారు.


అయితే సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌, సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆధ్వర్యంలో రైతులతో సమా వేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వీరితో చర్చించిన మంత్రి విశ్వరూప్‌ భూముల ధరలను ఫైనల్‌ చేశారు. ఎకరాకు రూ.74.50 లక్షలు ధరగా చెల్లించేందుకు విశ్వరూప్‌ చేసిన ప్రతి పాదనకు రైతుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. దాంతో గత మూడు నెలల నుంచి అమలాపురంలో వైద్యకళాశాల భూసేకరణకు ఏర్పడ్డ అవరోధం తొలగినట్టయింది. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేతులమీదుగా అమలాపురం లో చిందాడగరువు, సమనస మధ్య సేకరించే భూముల వద్ద కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అయిందని మంత్రి విశ్వరూప్‌ వెల్లడించారు. త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. 

Updated Date - 2020-09-25T17:27:35+05:30 IST