ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలి
ABN , First Publish Date - 2021-12-04T05:43:53+05:30 IST
ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంబంధింత మండలాల తహసీల్దార్లు ప్రతీరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంబంధింత మండలాల తహసీల్దార్లు ప్రతీరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సముదాయం నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 వరకు తహసీల్దార్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ధాన్యం తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉన్నవి, లేనివి అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఆర్ఐ, వీఆర్వోలను కేంద్రాలకు పంపించి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ సమస్యలు, ధరణి, మీ సేవ, దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డీఆర్వో శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీవో లీల, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్రెడ్డి, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, డీఏవో రణధీర్, సిరిసిల్ల తహసీల్దార్ విజయ్కుమార్ పాల్గొన్నారు.