'లవ్ జీహాద్‌'కు కళ్లెం... చట్టం చేయనున్న యోగి

ABN , First Publish Date - 2020-10-31T23:39:27+05:30 IST

గుర్తింపును (ఐడెంటిటీ) దాచిపెట్టి, మన మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని వారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని...

'లవ్ జీహాద్‌'కు కళ్లెం... చట్టం చేయనున్న యోగి

లక్నో: 'లవ్ జీహాద్'కు కళ్లెం వేసేందుకు తమ ప్రభుత్వం ఒక చట్టం తెస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కేవలం వివాహం కోసం మతం మారడం చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.


'వివాహం కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. మా ప్రభుత్వం కూడా లవ్ జీహాద్‌కు కళ్లెం వేసే దిశగా కసరత్తు చేస్తోంది. దీనిపై ఒక చట్టం తీసుకువస్తాం. తమ గుర్తింపును (ఐడెంటిటీ) దాచిపెట్టి, మన మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని వారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలి. లేకుంటే మీ... రామ్ నామ్ సత్య (అంత్యక్రియల్లో చేసే నినాదాలు) యాత్ర మొదలవుతుంది' అని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.


తీర్పులో ఏమి చెప్పారంటే..

తమ వైవాహిక జీవితంలో పోలీసులు, తన తండ్రి జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఓ యువతి, ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌‌ను అలహాబాద్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ప్రియాన్షి అలియాస్ శామ్రీన్, ఆమె భాగస్వామి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ, యువతి తొలుత మతం మారిన తర్వాత వివాహం చేసుకుందని, 2020 జూన్ 29న మతం మారగా, జులై 31న పెళ్లి జరిగిందని పేర్కొంది. దీనినిబట్టి కేవలం వివాహం చేసుకోడానికే ఆమె మతం మారినట్టు స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి కోసం మతం మారడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. ఎదుటి మతం గురించి ఎలాంటి అవగాహన, నమ్మకం, విశ్వాసం లేకుండా మతం మారిన తర్వాత వివాహం చేసుకోవడం అంటే బలవంతపు మతమార్పిడేనని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2020-10-31T23:39:27+05:30 IST