ప్రజా సమస్యలు పట్టని సర్కారు
ABN , First Publish Date - 2021-12-09T07:23:11+05:30 IST
ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
- పార్లమెంటులో చర్చకూ అనుమతించట్లేదు
- ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నారు
- మోదీ సర్కారుపై సోనియాగాంధీ ఫైర్
న్యూఢిల్లీ, డిసెంబరు 8: ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడంలేదని, వాటిపై పార్లమెంటులో చర్చించేందుకు కూడా అనుమతించడంలేదని విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంలో ఆ పార్టీ ఎంపీలనుద్దేశించి సోనియా మాట్లాడారు. దేశ సరిహద్దుల వద్ద ఎదురవుతున్న సవాళ్లపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు వీలున్నా.. ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వడంలేదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన మోదీ సర్కారు.. వాటి రద్దును కూడా అలాగే చేసిందన్నారు.
ఈ చట్టాల రద్దు కోసం జరిగిన ఉద్యమంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించుకోవాలంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ విక్రయిస్తూ జాతీయ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. 70 ఏళ్లుగా ప్రజాస్వామ్యం నిర్మించుకున్న వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. ఇక 12 మంది రాజ్యసభ సభ్యులను శీతాకాల సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. చరిత్రలో ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదని గుర్తు చేశారు. వారిపై సస్పెన్షన్ను ఎత్తివేసేదాకా పోరాడతామని తెలిపారు.