ప్రైవేటుకూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు

ABN , First Publish Date - 2022-06-04T04:40:43+05:30 IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలను.. ఇకపై ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లకూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచే ఈ విధానం అమలుకు సన్నద్ధమవుతోంది. ఎన్ని పుస్తకాలు అవసరమో ప్రతిపాదనలు పంపాలని ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలను ఆదేశించింది.

ప్రైవేటుకూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు
ఇచ్ఛాపురం ఎంఆర్‌సీలో పుస్తకాలు

ప్రైవేటుకూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు
ఇండెంట్‌ కోరిన విద్యాశాఖ అధికారులు
ఈ ఏడాది నుంచే నూతన విధానం అమలు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలను.. ఇకపై ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లకూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచే ఈ విధానం అమలుకు సన్నద్ధమవుతోంది. ఎన్ని పుస్తకాలు అవసరమో ప్రతిపాదనలు పంపాలని ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు అసహనం వ్యక్తం చేస్తూనే..  పుస్తకాల కోసం ప్రతిపాదనలు పంపుతున్నారు. కొత్త విధానంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల ప్రాథమిక పాఠశాలలకు అందించే ప్రశ్నపత్రాల వ్యవహారమే దీనికి ఉదాహరణ. ప్రైవేటు, కార్పొరేట్‌లోని 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ, ఎస్‌ఏ ప్రశ్నపత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంవత్సరం ఆరంభంలో కాకుండా ఎఫ్‌ఏ-2 పరీక్షలు ప్రారంభమప్పుడు ఇలా చెప్పడంతో విద్యార్థులతోపాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డాయి. ప్రైవేటులో ఒక సిలబస్‌, ఒక మెటీరియల్‌ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నపత్రాలకు, వారి చదివిన సిలబస్‌కు పొంతన ఉండదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని.. ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో 2021- 22 ఏడాదికి మినహాయింపు ఇచ్చింది. తాజాగా పాఠ్యపుస్తకాలు కూడా సరఫరాకు సన్నద్ధమవవడంతో ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రైవేటు యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై డీఈవో జి.పగడాలమ్మను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల నుంచి పుస్తకాల కోసం ప్రతిపాదనలు సేకరించామని తెలిపారు. చైల్డ్‌ ఇన్‌ఫోలో వివరాలు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2022-06-04T04:40:43+05:30 IST