ప్రభుత్వ పాఠశాలలు కళకళ
ABN , First Publish Date - 2021-09-18T03:51:46+05:30 IST
పాఠశాలలు పునఃప్రారం భం అనంతరం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతు న్నాయి. కరోనా నేపథ్యంలో సుమారు 15 నెలలపాటు మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈనెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద పనిచేసే పాఠశాలలను ప్రభుత్వం పునఃప్రారంభించింది.
ప్రైవేటు పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు
ఉచిత విద్య, మధ్యాహ్న భోజనమే కారణం
పక్షం గడిచినా పుంజుకోని హాజరు శాతం
ప్రారంభంకాని హాస్టళ్ళు
మంచిర్యాల, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు పునఃప్రారం భం అనంతరం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతు న్నాయి. కరోనా నేపథ్యంలో సుమారు 15 నెలలపాటు మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈనెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద పనిచేసే పాఠశాలలను ప్రభుత్వం పునఃప్రారంభించింది. కరోనా నేపథ్యంలో 22 మార్చి 2020 నుంచి దేశవ్యాప్తంగా విద్యాలయాలు మూతపడ్డాయి. 2020-21 విద్యా సంవత్సరంలో కొంతకాలం ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను రెండు సంవత్సరాలుగా పై తరగతులకు ప్రమోట్ చేసింది.
ఆసక్తి చూపని తల్లిదండ్రులు
కరోనా సెకండ్వేవ్ ప్రభావం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ విద్యాలయాలను ప్రారంభించింది. జూనియర్ కళాశాలల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగు తున్నప్పటికీ పాఠశాలల్లో పరిస్థితి అద్వానంగా ఉంది. పాఠశాలలు ప్రారంభించి పక్షం రోజులు గడిచినా తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరగకపోవడమే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ పుంజుకుంటుండగా, ప్రైవేటు పాఠశాలలు వెల వెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో విద్యార్థులు క్రమంగా బడిబాట పడుతున్నట్లు తెలు స్తోంది. విద్యా సంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలు గడిచిపోవడం, మిగిలి ఉన్న కాలానికి సంబంధించి పాఠశాలలు నడుస్తాయో లేదోనన్న సందేహంతో తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని సమా చారం. ప్రైవేటు స్కూళ్లకు పంపితే విద్యా సంవత్సరం మొత్తం ఫీజులు వసూలు చేస్తారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పుంజుకోని హాజరు శాతం
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి మూడు నెలలు ఆలస్యంగా ఈనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారం భించి 17 రోజులు గడుస్తున్నా విద్యార్థుల హాజరుశాతం పుంజుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూళ్లు 719 ఉన్నాయి. వీటిలో మొత్తం విద్యార్థులు 36,939 ఉండగా శుక్రవారం నాటికి 22,809 మంది హాజరవుతున్నారు. అలాగే ఎయిడెడ్ స్కూళ్లు 14 ఉండగా 1,565 విద్యార్థులకుగాను 426 మంది హాజరవుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు 213 ఉండగా 50,221 మంది విద్యార్థులకుగాను కేవలం 13,174 మంది హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 61.75 శాతం హాజరు నమోదవుతుండగా, ఎయిడెడ్ స్కూళ్లలో 27.22, ప్రైవేటు పాఠశాలల్లో 26.24 శాతం నమోదవుతోంది. ఐదు రోజులుగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం ఇలా ఉంది.
తేది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు హాజరు శాతం
13 18500 236 8500 30.70
14 18620 236 9883 32.39
15 22616 432 12865 40.48
16 22674 401 12066 39.61
17 22809 426 13174 41.04
హాస్టళ్లు ప్రారంభం కాకపోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించిన ప్రభుత్వం వసతితో కూడిన గురుకుల పాఠశాలలకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వపరంగా అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రభుత్వం కొవిడ్ దృష్ట్యా ప్రారంభించలేదు. జిల్లాలో మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్లు 3 ఉండగా, బీసీ వెల్ఫేర్ 7, ఎస్సీ వెల్ఫేర్ స్కూళ్లు 5 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 7వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో ప్రస్తుతం ఆన్లెన్ విధానంలో తరగతులు బోధిస్తుండగా, భౌతిక హాజరుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావడంతో హాజరు శాతం గణనీయంగా పడిపోయింది.