ప్రభుత్వ పథకాలకు ప్రజలకు చేరేలా చూడాలి
ABN , First Publish Date - 2021-07-31T06:07:36+05:30 IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మున్సిపల్ చైర్పర్సన్ వి.మనూజ చెప్పారు. వార్డు కౌన్సిలర్లు కనీసం వారానికి రెండుసార్లు తమ పరిధిలోని సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని కోరారు.
మదనపల్లె, జూలై 30: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మున్సిపల్ చైర్పర్సన్ వి.మనూజ చెప్పారు. ఎక్స్అఫిషియోసభ్యుడి హోదాలో ఎమ్మెల్యే ఎం.నవాజ్బాషా హాజరు కాగా, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ... వార్డు కౌన్సిలర్లు కనీసం వారానికి రెండుసార్లు తమ పరిధిలోని సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని కోరారు. మార్కెట్ విలువ ఆధారంగా విధిస్తున్న ఆస్తిపన్ను, చెత్తపన్ను ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలపై పడకుండా ఏడాదిపాటు వాయిదా వేయాలని కౌన్సిలర్ నాగార్జున(గాంధీ) కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, తమ పరిధిలో లేదని చెప్పారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల్లో ప్రైవేటు కమర్షియల్ గదులతో పోలిస్తే అద్దె చాలా తక్కువగా ఉందని, వీటిని పెంచడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. దీనిపై ఆర్వో మాట్లాడుతూ గతంలో రిజర్వేషన్ల ప్రకారం గదులు వేలం నిర్వహించామని, మూడేళ్లకోసారి 33శాతం అద్దెపెంచుతూ, 25ఏళ్ల వరకు రెన్యువల్ చేయాల్సి ఉందని సమాధానమిచ్చారు. వివిధ కారణాలు చూపి ట్రాన్స్ఫర్ అనుమతి కోరిన ఉపాధ్యాయులను బదిలీ చేయవద్దంటూ కౌన్సిలర్లు రామిశెట్టి శివ, మందనపల్లె వెంకటరమణ, ఎస్.వి.రమణ, కె.ప్రసాద్బాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. కాగా అజెండాలోని పదిఅంశాల్లో రెండు మినహా మిగిలిన అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.