ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ సహకారం
ABN , First Publish Date - 2020-05-23T09:55:00+05:30 IST
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని
వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
కలెక్టరేట్, మే 22: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొ న్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం, పునరుద్ధరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలు లేకపోతే నిరుద్యోగ సమస్య పెరుగుతుం దన్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్ల(సంక్షేమ)కు ఈ బాధ్యతలు చూడాలని ఆదేశిం చారు. కలెక్టర్లు కూడా దృష్టి సారించాలన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ.905కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం రూ.450 కోట్లు చెల్లిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి విద్యుత్, స్థిరచార్జీలు రూ.188 కోట్లు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. రూ.200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా సుమారు 360 రకాల వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఇక నుంచి 25 శాతం వస్తువులను ఎంఎస్ఎంఈల నుంచే కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ పథకం ద్వారా జిల్లాలో 27 సూక్ష్మ పరిశ్ర మలు, 70 చిన్న తరహా పరిశ్రమలు లబ్ధిపొందనున్నట్లు జిల్లా అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, పరిశ్రమల కేంద్ర జీఎం బి.గోపాలకృష్ణ, డీడీ రవిశంకర్, గ్రానైట్ పరిశ్రమల కార్యదర్శి రమాకాంతరెడ్డి, జీడి పరిశ్రమల సంఘ అధ్యక్షుడు బీవీ సత్యనారాయణ, పీవీఎస్ రామ్మోహన్రావు తదితరులు పాల్గన్నారు.
ఎంఎస్ఎంఈలకు ఉపశమనం: మంత్రి కృష్ణదాస్
ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో ఎంఎస్ఎంఈలకు ఉపశమనం లభించనుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఎంఎస్ఎంఈలకు పునరుత్తేజం కలిగించారని చెప్పారు. రూ.1110 కోట్లను అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం బకాయిపడిన రూ.827.50 కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి చెప్పారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.