వరద సహాయక చర్యలపై గవర్నర్ ఆరా
ABN , First Publish Date - 2021-11-12T14:48:58+05:30 IST
వాయు గుండం ప్రభావంతో నగరంతో పాటు ఇతర జిల్లాల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్తో మాట్లాడారు. పరిస్థితి ఎలా వుందంటూ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న
- సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఆర్ఎన్ రవి
చెన్నై: వాయు గుండం ప్రభావంతో నగరంతో పాటు ఇతర జిల్లాల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్తో మాట్లాడారు. పరిస్థితి ఎలా వుందంటూ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, తుపాను సహాయక చర్యల్లో భాగంగా చేపట్టిన ముందస్తు చర్యలు, జాగ్రత్తలను కూడా గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా జాతీయ విపత్తుల సహాయక బృందం (ఎన్డీఆర్ ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్తో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి ఫోన్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా వర్షపు నీరు, వరద నీరు ముంపు బాధిత ప్రాంతాల్లో సాగు తున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సహాయక చర్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించగా, మరికొన్ని బృందాలను సిద్ధంగా ఉంచారు.
ప్రధాని, హోంమంత్రికి ధన్యవాదాలు
భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వెల్లడించారు. దీంతో వీరిద్దరికి గవర్నర్ ఆర్ఎన్ రవి ధన్యవాదాలు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో సాగుతున్న చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన విషయం తెల్సిందే. కాగా గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రపతితో జరిగిన గవర్నర్ల సదస్సుకు ఆర్ఎన్ రవి హాజరయ్యారు.