పశుగ్రాసానికి భలే డిమాండ్
ABN , First Publish Date - 2022-01-21T05:27:25+05:30 IST
పశుగ్రాసానికి భలే డిమాండ్ ఉంది.
- ట్రాక్టర్ గడ్డి రూ.9వేలు
ఓర్వకల్లు, జనవరి 20: పశుగ్రాసానికి భలే డిమాండ్ ఉంది. ఓర్వకల్లు మండలంలో సాగునీరు లేకపోవడంతో పం టలు వర్షాధారంపైనే పండుతాయి. దీంతో మండలంలో పశుగ్రాసం లేక సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని హుశేనాపురం, ఓర్వకల్లు, కాల్వ, కన్నమడకల తదితర గ్రామాల్లో 400 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే వర్షాలు అధికంగా పడడంతో వరి పంట రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది. దీంతో రైతులకు పశుగ్రాసం లేకపోవడంతో జిల్లాలోని ఆలమూరు, కొణిదేడు, గడివేముల, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని రైతులు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ వడ్డి రూ.9వేల నుంచి రూ.10వేల దాకా కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రైతులకు ఉచితంగా పశుగ్రాసం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పశుగ్రాసానికి డిమాండ్ పెరిగింది
పశుగ్రాసానికి ఈ ఏడాది ధర విపరీతంగా పెరిగింది. దీంతో కొందరు రైతులు పశుగ్రాసాన్ని కొనలేకపోతున్నారు. మండలంలో పశుగ్రాసం కొర త ఏర్పడింది. అధిక వడ్డీలతో పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నాం.
- నాగరాజు, రైతు
ప్రభుత్వమే సరఫరా చేయాలి
పశుగ్రాసాన్ని ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఓర్వకల్లు మండలంలో వరిగడ్డి లేకపోవడంతో సూదూర ప్రాంతాల నుంచి వరిగడ్డిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- శ్రీనివాసులు, రైతు
రైతులను ఆదుకోవాలి
ఈ ఏడాది పశుగ్రాసానికి డిమాండ్ పెరిగింది. పాణ్యం మండలంలోని కొణిదేడు, ఆలమూరు, పాణ్యం, నంద్యాల, గడివేముల తదితర ప్రాంతాల నుంచి వరిగడ్డిని తెచ్చుకుంటున్నాం. పశువులను పస్తులు పెట్టలేక పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నాం.
- మురళీధర్ రెడ్డి, రైతు