వారం రోజులుగా కమిషనర్ కుర్చీ ఖాళీ
ABN , First Publish Date - 2021-12-08T16:17:08+05:30 IST
రామగుండం నగరపాలక సంస్థ చరిత్రలోనే మొదటి సారిగా వారం రోజులుగా కార్పొరేషన్కు బాధ్యులు లేని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ఇన్చార్జీ కమిషనర్ శంకర్కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన స్థానంలో ఇంత వర కు ఎవరినీ
రామగుండంలో పాలనాపరమైన వ్యవహారాలపై తీవ్ర ప్రభావం
పట్టించుకోని మున్సిపల్శాఖ, ప్రజాప్రతినిధులు
గోదావరిఖని/కోల్సిటీ: రామగుండం నగరపాలక సంస్థ చరిత్రలోనే మొదటి సారిగా వారం రోజులుగా కార్పొరేషన్కు బాధ్యులు లేని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ఇన్చార్జీ కమిషనర్ శంకర్కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన స్థానంలో ఇంత వరకు ఎవరినీ నియమించలేదు, ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదు. సాధారణంగా అధికారులు బదిలీ అయినప్పుడు కానీ, దీర్ఘకాలిక సెలవులు పెట్టినప్పుడు కానీ, ఇతర అధికారులను ఇన్చార్జీగా నియమిస్తారు. ఒక్క రోజు కూడా కుర్చీని ఖాళీగా ఉంచరు. రెండు రోజుల తరువాత పాలనాపరమైన వ్యవహారాలకు ఆటంకం కలుగకుండా మరో అధికారి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) ఇస్తారు. రామగుండం కార్పొరేషన్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం రోజులుగా కమిషనర్గా ఎవరినీ నియమించలేదు, బాధ్యతలూ ఇవ్వలేదు. ఈ విష యంలో జిల్లా యంత్రాంగం, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ప్రధాన కారణంగా తెలుస్తున్నది. శంకర్కుమార్ ఏసీబీకి పట్టుబడిన మూడు రోజులకు జిల్లా అధికారులు శంకర్ కుమార్ పోస్టింగ్ ఇతరుల గురించి వాకబు చేయడం ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయానికి ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. పైగా మున్సిపల్ శాఖ లోని ఒక కార్యాలయం బాధ్యులు రామగుండంకు ఫోన్చేసి మీకు కమి షనర్ ఎవరని ఆరా తీసినట్టు తెలు స్తున్నది. రామగుండంలో పాలన జిల్లా యంత్రాంగానికి కానీ, మున్సిపల్శాఖకు గానీ పట్టింపులేని వైఖరితో ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా ఖాళీగా ఉన్న కమిషనర్ స్థానం విషయంలో ఎలాంటి స్పందన కనబర్చకపోవడం గమనార్హం.