హంస వాహనంపై ఆదిదేవుడు
ABN , First Publish Date - 2022-02-25T06:50:57+05:30 IST
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
శ్రీగిరిపై వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, ఫిబ్రవరి 24: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబైన హంస వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ఆలయం నుంచి వెలుపలికి తోడ్కొని వచ్చి గ్రామోత్సవం జరిపారు. ఉత్సవం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నందిమండపం వరకు తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్ర స్వామి ఆలయం దాకా కొనసాగింది. గ్రామోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు మయూర వాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామివారికి మయూర వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.