తప్పుచేస్తే దేవుడు ఊరుకోడు
ABN , First Publish Date - 2021-09-30T06:44:39+05:30 IST
తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో
- శ్రీవారికి పూజ ఎలా చేయాలో వాళ్లకు తెలుసు
- పూజల విషయాల్లో కోర్టుల జోక్యం ఎందుకు?
- కేసును జాబితాలో చేర్చకపోతే చనిపోతానంటూ
- రిజిస్ట్రీని రోజూ బ్లాక్మెయిల్ చేయడం సరికాదు
- పిటిషనర్కు జస్టిస్ ఎన్వీ రమణ మందలింపు
- కైంకర్యాల ఆరోపణలపై తీసుకున్న చర్యలేంటి?
- వివరాలు సమర్పించండి.. టీటీడీకి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా టీటీడీలో ఆచార, సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్వయంగా వాదనలు వినిపించిన పిటిషనర్ ఏపీకి చెందినవారు కావడంతో జస్టిస్ రమణ కొద్దిసేపు తెలుగులో విచారణ జరిపారు.
‘‘బాలాజీ భక్తులకు సహనం ఉంటుంది. కానీ మీకు లేదు. కేసును జాబితాలో చేర్చకపోతే చనిపోతాను... అదీ ఇదీ అంటూ రిజిస్ట్రీని రోజూ బ్లాక్మెయిల్ చేయడం సరికాదు. ఏంటిది?... మేము కూడా వేంకటేశ్వరస్వామి భక్తులమే’’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. స్పందించిన శ్రీవారి దాదా అత్యవసర విచారణ కోసం అలా చేశానని వివరణ ఇచ్చారు. దాంతో ‘‘ఇందులో అత్యవసరం ఏముంది? పూజలు ఎలా చేయాలి? ఏ సమయంలో నిర్వహించాలి, ఎంతమందిని అనుమతించాలి అనే విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలా?’’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై టీటీడీకి వినతిపత్రాలు సమర్పించానని పిటిషనర్ పేర్కొన్నారు.
దాంతో ఆ వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీటీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్ను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి న్యాయవాది ఏదో చెప్పబోతుండగా అడ్డుకున్న జస్టిస్ రమణ.. ‘‘కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని పిటిషనర్ అంటున్నారు. ప్రతీ ఒక్కరికి స్వామివారిపై విశ్వాసం ఉంది. వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి’’ అని అడిగారు. వివరాలు తెలుసుకొని చెప్పడానికి కొంత సమయం ఇవ్వాలని టీటీడీ న్యాయవాది కోరారు. దీంతో శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, పూజల నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని టీటీడీని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.
తెలుగులో సీజేఐ విచారణ
జస్టిస్ రమణ: మీ పూర్తి పేరు ఏమిటి..? మీ ఊరేది?
పిటిషనర్: నా పేరు శ్రీవారి దాదా. మాది ప్రకాశం జిల్లా
జస్టిస్ రమణ: మీ ఇంటి పేరు ఏమిటి?
పిటిషనర్: మా ఇంటి పేరు ఏలూరి..
జస్టిస్ రమణ: మీ పేరే శ్రీవారి దాదానా?
పిటిషనర్: పూర్తి పేరు శ్రీవారి దాసానిదాసు,
మా నాన్న పేరు ఏలూరి శేషయ్య..
జస్టిస్ రమణ: అది చెప్పొచ్చు కదా. శ్రీవారి దాదా...
శ్రీవారి దాదా అంటున్నారు.. అదేదో దాదా
లాగా! దేవుడి ముందు చెప్పదల్చుకున్నప్పుడు పూర్తి పేరు చెప్పాలి.
పిటిషనర్: రాబోయే బ్రహ్మోత్సవం తప్పుగా జరగబోతోంది.
జస్టిస్ రమణ: తప్పు చేస్తే దేవుడు అందరినీ శిక్షిస్తారు. దేవుడు ఊరుకోడు.
పిటిషనర్: వస్త్రం లేకుండా అభిషేకం జరుగుతున్నది
జస్టిస్ రమణ: స్వామివారికి పూజ ఎలా చేయాలో వాళ్లు చూసుకుంటారు.
రాష్ట్రపతితో జస్టిస్ ఎన్వీ రమణ భేటీ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం విజ్ఞాన్ భవన్లో జాతీయ న్యాయసేవల సంస్థ ఆధ్వర్యంలో న్యాయసేవలపై జరగనున్న అవగాహన సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను రాష్ట్రపతికి జస్టిస్ రమణ వివరించారు.
