వైభవంగా భీమేశ్వరుని రథోత్సవం

ABN , First Publish Date - 2021-02-27T06:57:30+05:30 IST

ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణ మహోత్సవంలో భాగంగా భీమేశ్వరస్వామివారి రథోత్సవం శుక్రవారం భక్త కోలాహలంతో వైభవంగా జరిగింది.

వైభవంగా భీమేశ్వరుని రథోత్సవం

ద్రాక్షారామ, ఫిబ్రవరి 26: ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణ మహోత్సవంలో భాగంగా భీమేశ్వరస్వామివారి రథోత్సవం శుక్రవారం భక్త కోలాహలంతో వైభవంగా జరిగింది. మధ్యాహ్నం కల్యాణమూర్తులైన మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్ష్మీసమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లను పుష్పాలంకృతమైన రథంపై అర్చక స్వాములు అధిష్టింపచేశారు. దూపసేవ తర్వవత రథాంగబలి సమర్పించారు. 2.28 నిమిషాలకు దేవదాయశాఖ సహాయ కమిషనరు  కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, దేవదాయశాఖ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు, రథోత్సవానికి కొబ్బరి కాయకొట్టి ప్రారంభించారు. స్వామివారి రథం ఆలయం నుంచి సూర్యవీధి గుండా వెలంపాలెం చేరుకుని చంద్రవీధి మీదుగా మెయిన్‌రోడ్డు చేరుకుంది. తదుపరి మార్కెట్‌, యానాం సెంటర్‌ నుంచి వేగాయమ్మపేట చేరుకుంది.

ఘనంగా ఆస్థాన పూజ

రథం వేగాయమ్మపేటలో ఆస్థాన మండపం చేరుకుంది. రాత్రి 6.30 గంటలకు ఆస్థాన మండపంలో కల్యాణమూర్తులకు ఆస్థాన పూజ జరిగింది. వేద స్వస్తి తర్వాత పూజలు నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పం కార్యక్రమంతో ఆస్థాన పూజ ముగిసింది. కార్యక్రమంలో వాడ్రేవు సుందరరత్నకరావు, ఆలయ సహాయ కమిషనరు కేఎన్‌వీడివీ ప్రసాద్‌, ఆలయ సిబ్బంది, ఆలయ ఆస్థాన పండితులు దేవులపల్లి ఫణిరామకృష్ణ, అర్చకులు, వేదస్వస్తి వాచక బృందం, భక్తులు పాల్గొన్నారు. రథో త్సవం పురస్కరించుకుని రామచంద్రపురం సీఐ వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బంది విద్యుత్‌ సరఫరా క్రమబద్ధీకరించి విద్యుత్‌ వైర్లు తొలగించారు. వెనువెంటనే పునరుద్ధరించారు.


Updated Date - 2021-02-27T06:57:30+05:30 IST