తరుణ్ తేజ్‌పాల్ కేసులో తీర్పు వాయిదా

ABN , First Publish Date - 2021-05-12T17:24:51+05:30 IST

తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరణ్ తేజ్‌పాల్‌పై ఉన్న లైంగిక దాడి కేసులో ..

తరుణ్ తేజ్‌పాల్ కేసులో తీర్పు వాయిదా

పనజి: తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరణ్ తేజ్‌పాల్‌పై ఉన్న లైంగిక దాడి కేసులో తీర్పును గోవా సెషన్స్ కోర్టు మే 19వ తేదీకి వాయిదా వేసింది. కోవిడ్ నేపథ్యంలో సిబ్బంది కొరత ఉన్నందున తీర్పులో జాప్యం తలెత్తినట్టు నార్త్ గోవాలోని మపుజ జిల్లా, సెక్షన్స్ కోర్టు బుధవారంనాడు పేర్కొంది. ఈ కేసులో ఏప్రిల్ 27న తీర్పు ప్రకటించాల్సి ఉండగా, గత విచారణ సందర్భంగా తీర్పును మే 12కు వాయిదా వేసింది. తాజాగా మరోసారి తీర్పు వాయిదా పడింది.


గోవాలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్‌ లిఫ్ట్‌లో తనపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఒక మహిళ ఆరోపించడంతో 2013 నవంబర్‌లో కేసు నమోదైంది. అదే ఏడాది నవంబర్ 30న తేజ్‌పాల్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. 2014 ఫిబ్రవరిలో గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనపై 2,846 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 341,342,354,354ఎ, 354బి, 376(2)(ఎఫ్),376(2)(కే) కింద ఆయనపై కోర్టు విచారణ జరిగింది. తేజ్‌పాల్ దోషిగా తోలితే, ఆయనకు విధించబోయే జైలుశిక్షపై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలను కోర్టు వినే అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-05-12T17:24:51+05:30 IST