గుర్రంలో ప్రమాదకర వైరస్... విషమిచ్చి చంపిన వైద్యులు!
ABN , First Publish Date - 2021-06-30T11:57:18+05:30 IST
కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్య...
మీరట్: కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్య యూపీలోని మీరట్లోని ఒక గుర్రానికి ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆ గుర్రానికి విషమిచ్చి చంపేశారు. ఈ గుర్రానికి గ్లాండర్స్ వైరస్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోదానిని చంపడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. ఈ గుర్రం వైరస్ను వ్యాప్తిచేసే అవకాశం ఉంది.
అందుకే దానికి విషమిచ్చి చంపేసి, ఆ మృత కళేబరాన్ని 10 అడుగుల లోతైన గొయ్యిలో కప్పపెట్టారు. గుర్రానికి విషం ఇచ్చిన బృందం పీపీఈ కిట్ ధరించి ఈ పనిచేసింది. ఈ ఉదంతం హస్తినాపూర్ ప్రాంతంలోని గణేష్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో 12 రోజుల క్రితం ఒక గుర్రంలో గ్లాండర్స్ వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖ ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల నుంచి గుర్రాల శాంపిల్స్ తీసుకొని పరీక్ష కోసం పంపింది. దీనిపై రిపోర్టు రావలసి ఉంది. పశువైద్యశాఖాధికారి డాక్టర్ రాకేశ్ కుమార్ మాట్లాడుతూ గ్లాండర్స్ వైరస్ గుర్రాలలో కనిపించే ప్రాణాంతక వ్యాధి. గ్లాండర్స్ వైరస్ వ్యాధిని నయం చేయడం అసాధ్యం. ఫలితంగా ఈ వ్యాధి సోకిన గుర్రాన్ని చంపవలసి ఉంటుంది. ఈ వ్యాధి జంతువులకు సోకితే అది ఆ తరువాత మనుషులకు, పక్షులకు సోకే అవకాలున్నాయి. అందుకే ఆ గుర్రానికి ఇంజక్షన్ ద్వారా విషాన్నిచ్చి చంపేశామన్నారు. కాగా ఆ గుర్రపు యజమానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.