ఆడిట్ వివరాలు ఇవ్వండి
ABN , First Publish Date - 2021-06-18T05:12:41+05:30 IST
మాన్సాస్ ట్రస్టు ఆడిట్ వివరాలు తక్షణమే అందజేయాలని చైర్మన్ అశోక్ గజపతిరాజు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్న ఆయన ఏడాది కాలంగా మాన్సాస్లో జరిగిన వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఈవో, కరస్పాండెంట్హాజరుకాలేదు.
ఇసుక తవ్వకాలకు ఎవరు అనుమతులిచ్చారు?
రూ.5లక్షలతో ఏమేం కొనుగోలు చేశారు?
ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించండి
మాన్సాస్ సమీక్ష సమావేశంలో అశోక్ గజపతిరాజు
ఈవో, కరస్పాండెంట్ గైర్హాజరు
విజయనగరం రూరల్, జూన్ 17: మాన్సాస్ ట్రస్టు ఆడిట్ వివరాలు తక్షణమే అందజేయాలని చైర్మన్ అశోక్ గజపతిరాజు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్న ఆయన ఏడాది కాలంగా మాన్సాస్లో జరిగిన వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఈవో, కరస్పాండెంట్హాజరుకాలేదు. దీంతో అశోక్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశానికి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ, మాన్సాస్లో క్రమం తప్పకుండా ఆడిట్ జరిగేదని గుర్తు చేశారు. ఆడిట్ జరగలేదన్న ప్రచారం బయట వినపడిందని, తనకు తక్షణమే ఆ నివేదిక ఇవ్వాలని కోరారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆలయానికి సంబంధించిన భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎవరు అనుమతులిచ్చారు? అని ప్రశ్నించారు. దీనిపైనా సమగ్ర సమచారం ఇవ్వాలని ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.5 లక్షలతో వివిధ వస్తువులు కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో ఉందని, ఏ సామాన్లు కొనుగోలు చేశారో? తనకు స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. మాన్సాస్ ఉద్యోగుల జీతాల బకాయిలపై ఆరా తీశారు. బకాయిపడ్డ జీతాలను వారం రోజుల్లో చెల్లించాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మాన్సాస్ విద్యా సంస్థలకు సంబంధించి ఏడాది కాలానికి సంబంధించిన బడ్జెట్ను సంస్థల వారీగా తయారు చేసి వారం రోజుల్లో తనకు అందించాలన్నారు. అనంతరం ట్రస్టు భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లీజు గడువు ముగిసిన భూములకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఇంకా అనేక అంశాలను ప్రస్తావించారు.