రాత్రీపగలూ అదే పని.. చూస్తుండగానే పరిస్థితులు చేయిదాటిపోయాయి. చివరికి ఓ యువతి తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇది..
ABN , First Publish Date - 2021-09-06T00:23:35+05:30 IST
ఎంత ప్రయత్నించినా ఆ అలవాటును వదిలించుకోలేకపోయింది. పరిస్థితులు చేయిదాటిపోయాయి.. చివరికి ఓ యువతి తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇది.
ఇంటర్నెట్ డెస్క్: మొదట్లో అది ఓ సరదా! టైంపాస్ కోసమే కదా అనుకుంటూ ఆ యువతి తనకు తాను సర్ది చెప్పుకునేది. కానీ..చూస్తుండగానే అది వ్యసనంగా మారిపోయింది. రాత్రీపగలు తేడా లేకుండా ఆ వ్యసనంలో మునిగిపోయేది. దీంతో.. పరిస్థితులు చేయిదాటి పోయాయి! అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో ఆమెకు తెలియలేదు. చివరికి ఓ రోజు..ఆ యువతి తన తల్లి, తమ్ముడిని సరుకులు తెమ్మంటూ మార్కెట్కు పంపించింది. వారు ఇంటికొచ్చేసరికి ఆమె ఫ్యానుకు ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు బలైన మధ్యప్రదేశ్ యువతి(20) ఉదంతం ఇది. శనివారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకుంది.
మధ్యప్రదేశ్ హర్దా జిల్లాకు చెందిన రాధా అనే యువతి ఇండోర్లో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. పదిహేను రోజుల క్రితమే ఆమె నగరానికి వచ్చింది. కాగా.. శనివారం నాడు తల్లీ, తమ్ముడిని మార్కెట్కు వెళ్లమని చెప్పిన ఆమె.. వారు తిరిగొచ్చే సరికి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రిపగలూ తేడా లేకుండా రాధ ఆన్లైన్ గేమ్స్ ఆడేదని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపారు. రాత్రిళ్లూ ఆమెకు ఆన్లైన్ గేమ్స్ కంపెనీల నుంచి తరచూ ఫోన్, వాట్సాప్ కాల్స్ వచ్చేవని తెలిపాడు. కాగా..పోలీసుల విచారణలో ఆమె అప్పుల్లో కూరుకుపోయినట్టు కూడా తేలిసింది. ఇలా పరిస్థితులు చేయి దాటిపోవడంతో ఆమె శనివారం నాడు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. యువతి తల్లిదండ్రులు ఇద్దరూ రోజుకూలి చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. సోదరుడు అల్యూమినియం సామాన్ల తయారు చేసే పనిలో ఉన్నాడు. కాగా.. రాధ తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.