గులాంనబీ పదవి ఔట్‌

ABN , First Publish Date - 2020-09-12T07:35:48+05:30 IST

వర్కింగ్‌ కమిటీలోనూ, కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వం శుక్రవారంనాడు భారీగా మార్పులు చేసింది.

గులాంనబీ పదవి ఔట్‌

అసమ్మతి లేఖ నేతకు హైకమాండ్‌ ఝలక్‌

ప్రధాన కార్యదర్శి పోస్టునుంచి ఉద్వాసన

తెలంగాణ ఇన్‌ఛార్జి ఖుంటియా స్థానంలో 

కొత్త బాధ్యుడిగా మాణిక్యం ఠాగూర్‌

జితిన్‌ ప్రసాద, ముకుల్‌ వాస్నిక్‌లకు పదోన్నతి

అంబికాసోనీ, మోతీలాల్‌ వోరా, 

మల్లికార్జున్‌ ఖర్గేలూ తొలగింపు

వర్కింగ్‌ కమిటీలో భారీ మార్పులు

రాహుల్‌ గాంధీ టీమ్‌కు పదవులు

ఇక పగ్గాలు మళ్లీ రాహుల్‌కేనన్న సంకేతాలు

ప్రక్షాళనలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వర్కింగ్‌ కమిటీలోనూ, కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వం శుక్రవారంనాడు భారీగా మార్పులు చేసింది. రాహుల్‌ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించి- రానున్న నెలల్లో ఆయన పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింది. అన్నింటి కంటే ముఖ్యంగా.. అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నాయకుడు, గులాం నబీ ఆజాద్‌పై పార్టీ హైకమాండ్‌   ప్రతీకారం తీర్చుకుంది. సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. పార్టీలో సమగ్ర సంస్కరణలు, కిందిస్థాయి నుంచి ఎన్నికలు కోరుతూ లేఖ రాసిన 23 మందిలో గులాంనబీయే అగ్రనేత, ఆ అంశాన్ని వర్కింగ్‌ కమిటీలో నడిపిన వ్యక్తి. ఈ లేఖ రాసినందుకు తనకెవరిపైనా శత్రుత్వం, ద్వేషం లేదని చెబుతూనే సోనియా తాజాగా ఆయనను పదవీచ్యుతుణ్ని చేయడం విశేషం. ఆజాద్‌తో పాటు లేఖపై సంతకాలు చేసిన జితిన్‌ ప్రసాద, ముకుల్‌ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించారు. లేఖ రాసినందుకు క్షమాపణ చెప్పిన ముకుల్‌ వాస్నిక్‌ను సోనియా కు సహాయపడే ప్రత్యేక కమిటీలో చేర్చారు. ఇక  జితిన్‌ ప్రసాదను ఉత్తరప్రదేశ్‌ నుంచి తప్పించి- త్వరలో ఎన్నికలకు వెళుతున్న బెంగాల్‌కు ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎన్నికలు జరిపి సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని అసమ్మతి బృందం డిమాండ్‌ చేయగా అందుకు భిన్నంగా తాత్కాలిక ఇన్‌ఛార్జి హోదాలోనే కమిటీని ప్రక్షాళించడం, అందునా రాహుల్‌ విధేయులనే చేర్చడం విశేషం. 


సీనియర్లు ఔట్‌

కాంగ్రెస్‌ నాయకత్వం గురువారంనాడు ఏఐసిసిలో భారీ మార్పులు చేర్పులు ప్రకటించింది. ఆజాద్‌ మాదిరే ఎన్నో ఏళ్లుగా వివిధరాష్ట్రాల బాధ్యతలను చేపట్టిన మోతీలాల్‌ వోరా, అంబికా సోనీ, లుజినో ఫెలేరో, మల్లిఖార్జున ఖర్గే లాంటి వారిని ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించింది. వీరంతా గాంధీ కుటుంబానికి వీరవిధేయులు. గులాంనబీని తొలగించడంపై విమర్శలు రాకుండా ఈ సీనియర్లను కూడా బయటకు పంపి- కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక వర్కింగ్‌ కమిటీలోకి పి చిదంబరం, తారిఖ్‌ అన్వర్‌, రణదీప్‌ సూర్జేవాలా, జితేంద్రసింగ్‌లను రెగ్యులర్‌ సభ్యులుగా నియమించారు. ఇప్పటిదాకా సీడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న ఫెలీరో, వోరా, అధీర్‌ రంజన్‌ చౌదరి, తమరధ్వజ సాహూల స్థానే వీరుంటారు. ఇంతవరకూ చిదంబరం, సూర్జేవాలా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు.  


సూర్జేవాలాకు పదోన్నతి

మార్పుల్లో అధినాయకత్వానికి అమిత విధేయుడు, పార్టీ ప్రతినిధి అయిన రణదీప్‌ సూర్జేవాలా భారీగా లబ్ధిపొందారు. ఆయనకు పదోన్నతినిచ్చి-  ప్రధాన కార్యదర్శిగా చేసి -కర్ణాటక వ్యవహారాలను అప్పగించారు. రాహుల్‌ కోటరీలో నెంబర్‌ వన్‌ వ్యక్తి అయిన సూర్జేవాలా- పార్టీ వాణిని సమర్థంగా వినిపిస్తున్నందుకు ఈ ప్రమోషన్‌ కల్పించారని చెబుతున్నారు. వర్కింగ్‌ కమిటీలో రెగ్యులర్‌ సభ్యుడుగా కూడా పదోన్నతి పొందిన ఆయన సంస్థాగత వ్యవహారాలకు సంబంధించిన అనేక కమిటీల్లో కూడాసభ్యుడు. ఇక మరో సభ్యుడు జితేంద్రసింగ్‌కు అసోం బాధ్యతలు అప్పగించారు. 


మాణిక్యం ఠాగూర్‌కు తెలంగాణ

తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న ఒడిషా నేత రామచంద్ర ఖుంటియాను ఆ బాధ్యతలనుంచి తప్పించి తమిళనాడు  ఎంపీ మాణిక్యం ఠాగూర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఖుంటియా పార్టీ వ్యవహారాలను ఏమాత్రంపట్టించుకోవడం లేదని రాష్ట్ర సీనియర్‌ నేతలనేకమంది గతంలో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్వాసన ఊహించనదేనని అంటున్నారు. ఇక కొత్త ఇన్‌చార్జి ఠాగూర్‌ రాహుల్‌ గాంధీకి విధేయుడు. తమిళనాడులోని విరుధనగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయనను తమిళనాట కీలకనేతగా మార్చేందుకు రాహుల్‌ ప్రోత్సహిస్తున్నట్లు వినిపిస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీనే  సోనియా కొనసాగించారు. 


అసమ్మతి లేఖపై సంతకం చేసిన మరికొందరు ప్రముఖులకు కూడా ఏఐసీసీలో , వర్కింగ్‌ కమిటీలో ఎలాంటి స్థానమూ దక్కలేదు. వీరిలో శశి థరూర్‌, మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ ఉన్నారు. అదే విధంగా రాజస్థాన్‌లో తిరుగుబాటు బావుటా ఎగరేసి రాహుల్‌-ప్రియాంకల చొరవతో కాంగ్రె్‌సలోనే ఉండిపోయిన సచిన్‌ పైలట్‌కూ ఎలాంటి స్థానం ఇవ్వలేదు. అయితే ఆయన జాతీయ రాజకీయాలకు రావడానికి విముఖంగా ఉన్నట్లు వినిపిస్తోంది. 

Updated Date - 2020-09-12T07:35:48+05:30 IST