భయపెడుతున్న శిథిల భవనాలు
ABN , First Publish Date - 2022-06-20T16:05:47+05:30 IST
మహా నగరంలో శిథిల భవనాల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఏటా 200కు పైగా నిర్మాణాలు జాబితాలో చేరుతుండగా, ఆ స్థాయిలో కూల్చివేతలు
తాజాగా 263 గుర్తింపు.. అంతకుముందు 261
కూల్చివేతల్లో జీహెచ్ఎంసీ అలసత్వం
హైదరాబాద్ సిటీ: మహా నగరంలో శిథిల భవనాల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఏటా 200కు పైగా నిర్మాణాలు జాబితాలో చేరుతుండగా, ఆ స్థాయిలో కూల్చివేతలు జరగడం లేదు. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. కొన్నేళ్లుగా నగరంలో అధిక వర్షపాతం నమోదవుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో శిథిల భవనాలు కుప్పకూలుతున్నాయి. 2016లో నగరంలోని నాలుగు చోట్ల పురాతన భవనాలు కూలి ఎనిమిది మంది మృతి చెందారు. 2020 అక్టోబర్లో మొఘల్పురాలో శిథిల భవనం కూలగా, అక్కడుంటున్న వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పాతబస్తీలోని మూసాబౌలి, హుస్సేనీ ఆలం తదితర ప్రాంతాల్లో గతంలో పురాతన నిర్మాణాలు కూలిపోయాయి. ఘటనలు జరిగినప్పుడు, వర్షాకాలం ప్రారంభానికి ముందు అధికారులకు శిథిల భవనాలు గుర్తొస్తున్నాయి.
కొత్తగా 263..
ఈ సంవత్సరం క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో 263 నిర్మాణాలను అధికారులు గుర్తించారు. అంతకుముందు కూల్చని భవనాలు 261 ఉన్నాయి. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శిథిల భవనాలు గుర్తిస్తుండగా, ఇంజనీరింగ్ అధికారులు వాటి నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించి కూల్చివేయాలా, మరమ్మతు చేయాలా, ఆధునీకీకరించాలా అన్నది సూచిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
శిథిల భవనాల కూల్చివేతకు క్షేత్రస్థాయిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. యజమానులు, అద్దెకున్న వారు ఖాళీ చేయకుండా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకువచ్చిన సందర్భాలూ ఉన్నాయి. మరమ్మతు చేస్తామని అధికారులకు చెబుతున్న భవనాల యజమానులు.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అదే క్రమంలో యంత్రాంగం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. వాస్తవంగా వేసవి కాలంలో శిథిల భవనాల కూల్చివేత సులువు. అయినా జీహెచ్ఎంసీ మాత్రం వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే తప్ప వాటి జోలికి వెళ్లడం లేదు.