ఘరానా మోసగాడి అరెస్టు

ABN , First Publish Date - 2021-04-11T07:08:27+05:30 IST

ఉద్యోగాలిప్పిస్తానంటూ జిల్లావ్యాప్తంగా పలువురిని మోసం చేసి.. రూ.కోటికిపైగా వసూలు చేసిన ఘరానా మోసగాడిని పాకాల ఎస్‌ఐ కె.రాజశేఖర్‌ శనివారం అరెస్టు చేశారు.

ఘరానా మోసగాడి అరెస్టు
పి.రాజశేఖర్‌

ఉద్యోగాలిప్పిస్తానంటూ రూ.కోటికి పైగా మోసం


పాకాల, ఏప్రిల్‌ 10: ఉద్యోగాలిప్పిస్తానంటూ జిల్లావ్యాప్తంగా పలువురిని మోసం చేసి.. రూ.కోటికిపైగా వసూలు చేసిన ఘరానా మోసగాడిని పాకాల ఎస్‌ఐ కె.రాజశేఖర్‌ శనివారం అరెస్టు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ బత్తలాపురానికి చెందిన పీతాంబరం రాజశేఖర్‌ (32) తాను ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఆపరేషన్‌ ఆర్‌ఎస్‌ఐ, పుత్తూరు ఎస్‌ఐ, తిరుమల విజిలెన్స్‌ ఎస్‌ఐ, ప్రొటోకాల్‌ ఆఫీసర్‌, పలమనేరు, పెద్దపంజాణి ట్రైనింగ్‌ ఎస్‌ఐ, సెంట్రల్‌ హోమ్‌ మినిస్టర్‌ కిషన్‌రెడ్డి స్పెషల్‌ పీఏ, చిన్నరాజప్ప పర్సనల్‌ అసిస్టెంట్‌.. ఇలా పలు రకాలుగా చెబుతూ జనాన్ని నమ్మించాడు. అలాగే తన భార్య ఐఏఎస్‌ అధికారి అని, వైజాగ్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అని చెబుతూ మోసాలకు పాల్పడ్డాడు. తిరుపతి, తిరుమల, పలమనేరు, పెద్దపంజాణి, గుడుపల్లె, బైరెడ్డిపల్లె, తవణంపల్లె మండలాలతోపాటు నెల్లూరులోని ఉపాధ్యాయులు, పోలీసులు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆర్టీసీ ఉద్యోగులను బురిడీ కొట్టించి వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.కోటికిపైగా నగదు వసూలు చేశాడు. అంతేకాకుండా ఎర్రచందనం కేసుల్లో పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను తక్కువ ధరకు తీసిస్తానని చెప్పి.. నగదును తనకు తెలిసిన వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయించి, డ్రా చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఈనెల ఏడో తేదీన పోలీసులు  కేసు నమోదు చేసి.. నిందితుడిని విచారణకు హాజరు కావాల్సిందిగా శుక్రవారం నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు హాజరు కాకుండా చెన్నై పారిపోతున్న ఈ మోసగాడిని శనివారం నేండ్రగుంటలో అరెస్టు చేశారు. ఇంకా చాలామంది బాధితులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే వస్తాయని.. ఇలాంటి మోసగాళ్ల వలలో పడొద్దని ఎస్‌ఐ రాజశేఖర్‌ సూచించారు. 

Updated Date - 2021-04-11T07:08:27+05:30 IST