కానిస్టేబుళ్లపై చాకుతో యువకుల దాడి
ABN , First Publish Date - 2020-11-29T06:32:29+05:30 IST
అర్ధరాత్రి రోడ్డు పక్క నిలబడి మాట్లాడం ఏంటి, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఇద్దరు కానిస్టేబుల్స్పై చాకుతో దాడి చేసి పరారైన సంఘంటన శుక్రవారం అర్ధరాత్రి కొండయ్యపాలెంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.
- గాయాలతో జీజీహెచ్లో చేరిక
జీజీహెచ్(కాకినాడ), నవంబరు 28: అర్ధరాత్రి రోడ్డు పక్క నిలబడి మాట్లాడం ఏంటి, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఇద్దరు కానిస్టేబుల్స్పై చాకుతో దాడి చేసి పరారైన సంఘంటన శుక్రవారం అర్ధరాత్రి కొండయ్యపాలెంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఆర్మ్డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రావులకొండ బాలురెడ్డి, ఏంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్)లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వై.బలిరెడ్డి శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ కొండయ్యపాలెం మిలట్రీరోడ్డు మీదుగా కారులో ఏపీఎస్పీకి వెళ్తున్నారు. ఆ సమయంలో కొండయ్యపాలెం రోడ్డులో అదే రహదారిలో రోడ్డు పక్కన ఉన్న వంశీ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై సైకిల్పై వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై పని ఏంటని ఆ యువకుల్ని ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రశ్నించారు. ఈ విషయమై ఇద్దరూ జరిగిన వాగ్వాదంతో కోపోద్రోకానికి గురైన ఓ యువకుడు తన వద్ద ఉన్న చాకుతో కానిస్టేబుల్స్ రావులకొండ బాలురెడ్డి, వై.బలిరెడ్డిలపై దాడి చేసి పొడిచి హత్యాయత్నానికి పాల్పడి అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్స్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో జీజీహెచ్కు తరలించారు. దాడిలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సిబ్బందిని శనివారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పరిశీలించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావును కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ వి.భీమారావు ఉన్నారు. కేసును టూటౌన్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.