దుబే ఎన్‌కౌంటర్‌ను సమర్ధించిన భార్య రిచా దుబే

ABN , First Publish Date - 2020-07-11T05:29:34+05:30 IST

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ను ఆయన భార్య రిచా దుబే సమర్థించారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారు పడతారని ఆమె వ్యాఖ్యానించారు. చేసిన పాపానికి తాను బలైపోయాడని చెప్పారు.

దుబే ఎన్‌కౌంటర్‌ను సమర్ధించిన భార్య రిచా దుబే

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ను ఆయన భార్య రిచా దుబే సమర్థించారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారు పడతారని ఆమె వ్యాఖ్యానించారు. చేసిన పాపానికి తాను బలైపోయాడని చెప్పారు. కాన్పూర్‌లోని భైరవ్ ఘాట్‌లో నిర్వహించిన దుబే అంత్యక్రియలకు ఆమె సోదరుడు, కుమారుడు హాజరయ్యారు. ఇతర బంధువులెవరూ హాజరుకాలేదు. స్వయంగా దుబే తల్లి కుమారుడి ముఖాన్ని చూసేందుకు ఇష్టపడలేదు. తాను అంత్యక్రియలకు హాజరుకాబోనని దుబే తండ్రి ముందే చెప్పేశారు. దుబే తమ మాట ఏనాడూ వినలేదని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.   


అంతకు ముందు  కాన్పూర్ లాలా లజపతి రాయ్ ఆసుపత్రిలో దుబే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం నెగెటివ్‌గా తేలింది. ఆ తర్వాత మృతదేహానికి ముగ్గురు వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో తీశారు. దుబే శరీరంలో మొత్తం నాలుగు బుల్లెట్లున్నాయని వైద్యులు తెలిపారు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యాక కాన్పూర్ ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని దుబే బావమరిది దినేశ్ తివారికి అప్పగించారు. 


నిన్న ఉజ్జైన్ నుంచి దుబేను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో దుబే పోలీసుల దగ్గర్నుంచి 9ఎంఎం పిస్టల్ తీసుకుని పారిపోతూ కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో దుబే హతమయ్యాడు. ఘటనలో కానిస్టేబుళ్లు, కమెండోలు గాయపడ్డారు. వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

Updated Date - 2020-07-11T05:29:34+05:30 IST