‘గాంధీ’లో పనిచేయని ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు
ABN , First Publish Date - 2021-11-16T16:01:52+05:30 IST
గాంధీ ఆస్పత్రిలో రెండేళ్ల నుంచి ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే ఉస్మానియా ఆస్పత్రిలో
రోగుల ఇబ్బంది
హైదరాబాద్/అడ్డగుట్ట: గాంధీ ఆస్పత్రిలో రెండేళ్ల నుంచి ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే ఉస్మానియా ఆస్పత్రిలో ఎమ్మారై పరీక్షలు చేయించి గాంధీ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఎమ్మారై పరీక్షల కోసం వారం లేదా 20 రోజులు ఆగాల్సిందే. దీంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు అవస్థలు పడుతున్నారు.
ప్రైవేట్లో దోపిడీ
గాంధీ ఆస్పత్రిలో ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో వైద్యులు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లమని సూచిస్తున్నారు. కొందరు వైద్యులు తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లకు సిఫార్సు చేస్తున్నారు. ఒక ఎమ్మారై పరీక్షకు రూ. 8 వేలు తీసుకుంటున్నారు. ఎమ్మారై పరీక్షలు బయట చేయించుకుంటే రూ. 10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తవి కొనుగోలు చేశాం
ఆస్పత్రిలో గతంలో ఉన్న ఎమ్మారై యంత్రాలు పనిచేయకపోడంతో రూ. 7 కోట్లతో రెండు కొత్తవి కొనుగోలు చేశాం. ఓపీలో కొత్తగా బ్లాక్ ఏర్పాటు చేసి అందులో వాటిని బిగిస్తున్నాం. కొద్ది రోజుల్లో వినియోగంలోకి తీసుకొస్తాం. ఎమ్మారై పరీక్షలు అత్యవసరమైన రోగులకు ఉస్మానియా ఆస్పత్రిలో చేయిస్తున్నాం.
- ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్