ప్రజలను మోసగించేందుకే గడప గడపకు..

ABN , First Publish Date - 2022-05-17T06:47:39+05:30 IST

ప్రజలను మరోమారు మోసగించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టిందని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

ప్రజలను మోసగించేందుకే గడప గడపకు..
విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అనిత

తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత


పాయకరావుపేట, మే 16: ప్రజలను మరోమారు మోసగించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టిందని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. సోమవారం పాయకరావుపేట వచ్చిన ఆమె స్థానిక విలేఖరులతో మాట్లాడారు. మొదట గడపగడపకు వైసీపీ అని పేరు పెట్టుకున్న ప్రభుత్వం, ప్రజలు తంతారన్న భయంతో తరువాత గడపగడపకు మన ప్రభుత్వంగా మార్చుకుందన్నారు. తద్వారా పోలీసులు, అధికారుల సాయంతో సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. 90 శాతం హామీలు పూర్తిచేశామని చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన భజన బృందం, మూడేళ్ల తరువాత గడపగడపకు వచ్చి అన్ని పథకాలు అందుతున్నాయా? అని అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్పించి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూపాయ పనికూడా జరగలేదని అనిత ఎద్దేవా చేశారు. తమ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే, గడచిన మూడేళ్లలో రూ.12 కోట్లు కూడా తేలేకపోయారని అనిత అన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షుడు పెదిరెడ్డి శ్రీను, నాయకులు డి.రాజబాబు, ఎం.రమాకుమారి, చించలపు ప్రదీప్‌, వేములపూడి అప్పారావు, ఆది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T06:47:39+05:30 IST