Open internet: స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌పై దాడి జరుగుతోంది.. Google CEO వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-07-13T00:23:40+05:30 IST

ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌పై పలు దేశాల్లో దాడి జరుగుతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా వ్యాఖ్యానించారు.

Open internet: స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌పై దాడి జరుగుతోంది.. Google CEO వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌పై పలు దేశాల్లో దాడి జరుగుతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అనేక దేశాలు సమాచార మార్పిడికి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నాయని, స్వేఛ్చాయుత ఇంటర్నెట్‌ను చాలా ఆషామాషీగా తీసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘ఇది తిరోగమనంలో అడుగులు వేయడమే..నా దృష్టిలో స్వేఛ్చాయుత ఇంటర్నెట్ అంటే మంచిని పెంచే ఓ శక్తి. కానీ..మనం దీన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాం’’ అని పిచాయ్ అన్నారు.  ‘‘డిఫరెంట్ ఇంటర్నెట్స్’’ అనే అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ రకంగా సమాధానమిచ్చారు. ఆన్‌లైన్‌లో ఏరకమైన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం, ఏవి కావు అనే అంశంపై వివిధ దేశాలు భిన్నమైన చట్టాలు తేవడాన్ని ‘డిఫరెంట్ ఇంటర్నెట్స్’ అనే పేరుతో పిలుస్తున్నారు. 


‘‘ఇంటర్నెట్‌లో వ్యక్తమయ్యే అభిప్రాయాల్లో ఏవి ఆమోదయోగ్యం, ఏవి కావు అనే విషయంపై ప్రతి దేశంలో చర్చ జరుగుతోంది. నా అభిప్రాయం ప్రకారం.. మరింత ప్రధాన విషయం నుంచి మన దృష్టి మళ్లింది. అదేంటంటే..దేశాలు ప్రస్తుతం సమాచార ప్రవాహానికి పరిమితులు విధిస్తున్నాయి..మార్చడానికి వీలులేని సరిహద్దులను ఏర్పాటు చేస్తున్నాయి.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సంస్కృతి, విలువలు దృఢంగా ఉన్న దేశాలు ఈ పోకడలను అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.   

Updated Date - 2021-07-13T00:23:40+05:30 IST