స్వచ్ఛంద సంస్థ పేరిట రూ.96 లక్షల మేర మోసం
ABN , First Publish Date - 2022-06-20T18:06:58+05:30 IST
స్వచ్చంధ సంస్థ ముసుగులో ఓ మహిళ వద్ద రూ.96 లక్షల వరకు వసూలు చేసిన ఒక మహిళ, మరో వ్యక్తి పరారీలో ఉన్నారు
పరారీలో నిందితులు
చెన్నై/అడయార్: స్వచ్చంధ సంస్థ ముసుగులో ఓ మహిళ వద్ద రూ.96 లక్షల వరకు వసూలు చేసిన ఒక మహిళ, మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ వీఎం నగర్కు చెందిన ఆర్.గీతా (57) అనే మహిళను తిమ్మభూపాలపురం గ్రామానికి చెందిన తేన్మొళి, రవిచంద్రన్ సంప్రదించి పేదల అభ్యున్నతికి కోసం ఆవులు, గేదెలు, గొర్రెలను పంపిణీ చేసే ప్రాజెక్టును ప్రారంభించామని, అందుకు కొంత డబ్బు సాయం చేయాలని కోరారు. దీంతో ఆ మహిళ ముందు రూ.3.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ డబ్బును చెప్పిన సమయానికి తిరిగి చెల్లించారు. దీంతో తేన్మొళిపై గీతకు నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత గీత నుంచి పలు దఫాలుగా రూ.96 లక్షల వరకు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తనతో పాటు తన కుటుంబ సభ్యుల నుంచి సేకరించి ఇచ్చారు. ఈ మొత్తాన్ని తీసుకున్న తేన్మొళి, రవిచంద్రన్ పత్తాలేకుండా పారిపోయారు. గీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరువళ్లూరు పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.