విద్యుదాఘాతంతో నలుగురు బాలుర మృతి
ABN , First Publish Date - 2022-05-20T06:11:27+05:30 IST
సరదాగా ఈతకు వెళ్లిన నలుగుర్ని మృత్యువు మింగేసింది. మండలంలోని ఆలంకొండ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది.
ఆలంకొండలో విషాదఛాయలు
క్రిష్ణగిరి, మే 19: సరదాగా ఈతకు వెళ్లిన నలుగుర్ని మృత్యువు మింగేసింది. మండలంలోని ఆలంకొండ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వీరాంజనేయులు, సుజాతల కొడుకు నక్క కార్తీక్(13), సంగాల ఈశ్వరయ్య, రాధమ్మల కుమారుడు సంగాల సాయి(12), రామనాయుడు, రామేశ్వరమ్మల తనయుడు గుడిసె రాకేష్(12), షేక్ అమీన సాహెబ్, రమీజాబీల కుమారుడు షేక్ కమాల్ బాషా(12) గురువారం గ్రామ సమీపంలోని నీళ్ల గచ్చులో ఈత కొట్టేందుకు వెళ్లారు. గచ్చుకు షార్ట్సర్క్యూట్ కావడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు సమీప బావుల దగ్గర గాలించారు. గ్రామ సమీపంలోని నీళ్ల గచ్చులో రాత్రి 7గంటల సమయంలో నలుగురు శవమై కనిపించారు. కాగా ఈశ్వరయ్య, రాధ మ్మలకు సంగాల సాయి ఒక్కడే సంతానం. నక్క కార్తీక్ కూడా ఒక్కడే కొడుకు. షేక్ కమాల్ బాషా మాత్రం అవ్వాతాతల వద్ద సరదాగా గడపడానికి వచ్చి మృత్యు వాత పడ్డాడు. దీంతో వీరి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాడు.